జగన్కు జైల్లో శాటిలైట్ ఫోన్లు, కొత్త అల్లుడు: దేవినేని
తెలుగుదేశం పార్టీ నేతలు దేవినేని ఉమా మహేశ్వరరావు, వర్ల రామయ్య వేర్వేరుగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కిరణ్ సర్కార్ జగన్ను చంచల్గూడ జైల్లో కొత్త అల్లుడి మాదిరిగా చూసుకుంటోందని, వారిద్దరూ క్విడ్ ప్రో కో మాదిరిగా పరస్పరం ఇచ్చి పుచ్చుకొని ఒకరినొకరు కాపాడుకొంటున్నారని దేవినేని ఉమా మహేశ్వర రావు విమర్శించారు.
ప్రత్యేక వాహనాల్లో అధునాతన పరికరాలు పెట్టి వాటిని జగన్ గది సమీపంలో ఉంచుతున్నారని, జగన్ శాటిలైట్ ఫోన్ల ద్వారా ఈ పరికరాల సాయంతో జైల్లోంచే అందరితో మాట్లాడుతున్నారని, జైల్లో జగన్కు ఇబ్బంది కలుగకుండా ఒక్క క్షణం కూడా కరెంటు పోనివ్వడం లేదని, పోయిన మరుక్షణమే జనరేటర్ వేస్తున్నారని ఆయన అన్నారు.
జగన్ ఏకంగా జైలు సూపరింటెండెంట్ గదినే తన చాంబర్గా వినియోగించుకుంటున్నారని వర్ల రామయ్య ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జగన్తో లాలూచీ పడ్డారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలని ప్రశ్నించారు. జైల్లో జగన్ దందాపై తమకు 15 పేజీల లేఖ అందిందని చెప్పారు. జైలు సూపరింటెండెంట్ జగన్ సేవలో తరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు వరకు జగన్కు తన సీటు అప్పగించి సూపరింటెండెంట్ బయట తిరుగుతుంటారని, ఆ కుర్చీలోనే కూర్చుని జగన్ తన కోసం వచ్చిన వారిని కలుస్తున్నారని, ఇలా రోజుకు సుమారు 400 మందిని కలుస్తున్నారని, రోజూ జగన్కు పంపే వంటకాలనే ఖైదీలందరికీ వడ్డిస్తూ ఉదారత చాటుకుంటున్నారని వర్ల రామయ్య ఆరోపించారు.
అసలు రాష్ట్రంలో ప్రభుత్వం లేదని, చంచల్గూడ జైల్లో ఏం జరుగుతోందో దర్యాప్తు చేయించే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రికి, హోంమంత్రికి లేవని విమర్శించారు. చంచల్గూడ జైలు అధికారులను తక్షణమే మార్చాలని డిమాండ్ చేశారు. రిమాండ్ ఖైదీలు చంచల్గూడ జైల్లో జరుగుతున్న ఈ వైభోగాల గురించి విని తమను అక్కడికే పంపాల్సిందిగా జడ్జిలను వేడుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చునని, మాజీ కేంద్ర మంత్రి రాజా, కనిమొళి, సురేష్ కల్మాడీ, మధుకోడా వంటి వారు జైళ్లలో చిప్పకూడు తిని గడిపితే జగన్కు మాత్రం రాజభోగాలు కల్పిస్తున్నారని రామయ్య విమర్శించారు.