భర్తను గొడ్డలితో నరికిన భార్య: విద్యార్థిపై వేడినీళ్లు
వరంగల్ జిల్లాలోని హన్మకొండ మండలం అరెల్లలో దారుణం జరిగింది. ఏడో తరగతి విద్యార్థిపై ఓ ప్రైవేటు స్కూల్ కరెస్పాండెంట్ భార్య వేడినీటిని పోసి గాయపరిచింది. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
భార్యపై దాడి చేసిన భర్త..
సికింద్రాబాద్లోని కుషాయిగుడాలో అదనపు కట్నం సాకుగా చూపి భార్యను వదిలించుకోవాలని ఓ వ్యక్తి ప్రయత్నించాడు. తల్లిదండ్రులు, బంధువులతో కలిసి భార్యపై దాడికి పాల్పడ్డాడు. కర్నూలు జిల్లాకు చెందిన డేనియల్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈయనకు ఐదుగురు సంతానం. చిన్న కూతురు స్వర్ణలతను అశోక్నగర్కు చెందిన మోహన్కిచ్చి 2011లో వివాహం జరిపించారు. కొంతకాలం పాటు వారి సంసార జీవితం సజావుగా కొనసాగింది. వారికి ఓ పాప జన్మించింది. పెయింటర్గా పనిచేసే మోహన్ చెడు అలవాట్లకు బానిసయ్యాడు.
ఈ క్రమంలో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. అదనంగా కట్నం తేవాలంటూ భార్యను వేధించడం మొదలుపెట్టాడు. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో కర్నూలు వెళదామంటూ భార్యను తీసుకుని ఇంటి నుంచి బయలు దేరాడు. మల్లాపూర్ బస్టాప్ వద్దకు వచ్చాక ఇప్పుడే వస్తానంటూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. అర్థరాత్రి సమయంలో పసిపాపతో సుమారు గంట పాటు స్వర్ణలత వేచి చూసింది. ఎంతకూ భర్త తిరిగి రాకపోవడంతో ఇంటికి వెళ్లింది.
అక్కడ భర్త, అత్త,మామలతో పాటు మరికొంతమంది బంధువులు మద్యం తాగుతూ కనిపించారు. స్వర్ణలతను గమనించిన వారు మద్యం మత్తులో విచక్షణారహితంగా కొట్టారు. రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపిన ఆమె మంగళవారం ఉదయం జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయగా వారు నగరానికి చేరుకుని కుషాయిగూడ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ శంకరయ్య తెలిపారు.