సబితా ఇంద్రారెడ్డి ఇష్యూ: సోనియాతో ఆజాద్ భేటీ
సుమారు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో ప్రధానంగా రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీబీఐ చార్జిషీట్ దాఖలు చేయడంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సబితకు శాఖ మార్చడమా లేదా అన్న దానిపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. నివేదిక ఆధారంగా చర్య తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. సబితా ఇంద్రారెడ్డిపై నేడో రేపో నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ఎఐసిసి వర్గాలు భావిస్తున్నాయి.
సబితా ఇంద్రారెడ్డితో పాటు ఇతర కళంకిత మంత్రులపై కూడా ఏం చేయాలనే విషయంపై సోనియా గాంధీ కచ్చితమైన నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. ఈనెల 18వ తేదీన సీఎం కిరణ్కుమార్రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీకి వస్తున్న సందర్భంగా వారితో కూడా చర్చలు జరిపి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సబితా ఇంద్రారెడ్డికి ఇతర మంత్రులు బాసటగా నిలుస్తున్నారు. దానికితోడు, రాజీనామా చేయాలనే సబితా ఇంద్రారెడ్డి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వ్యతిరేకిస్తున్నారు. సబితా ఇంద్రారెడ్డి రాజీనామాను ఆమోదిస్తే, ధర్మాన ప్రసాదరావు వ్యవహారం మళ్లీ మొదటికి రావడంతో పాటు మిగతా మంత్రుల చేత కూడా రాజీనామాలు చేయించాల్సి వస్తుందని, ఇది తీవ్రమైన సమస్యకు దారి తీస్తుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది.