అప్పుల్లో ఉన్నా పెట్టుబడి పెట్టారు: జగన్ కేసులో సిబిఐ

అప్పుల్లో ఉన్నా నిబంధనలకు విరుద్ధంగా పెట్టుబడులు పెట్టారని, ఇవి ముడుపులు తప్ప మరేమీ కాదని, ఇదే విషయాన్ని ఆర్వోసీ నిర్ధారించిందని సిబిఐ తన తాజా ఛార్జీషీటులో పేర్కొంది. హెటిరో గ్రూప్ సంస్థలకు, జగన్ సంస్థలకు మధ్య జరిగిన ఆర్థిక అక్రమాలను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్వోసీ) కూడా నిర్ధారించిందని, జగన్కు చెందిన జగతి పబ్లికేషన్స్, జనని ఇన్ఫ్రాలో హెటిరో, అరబిందో, ట్రైడెంట్ సంస్థలు అసాధారణ పెట్టుబడులు పెట్టాయని ధ్రువీకరించిందని పేర్కొంది.
ఆ నిధుల ప్రవాహం అక్రమమేనని అభిప్రాయపడింది. ఈ మూడు సంస్థల నుంచి రూ.36.50 కోట్ల పెట్టుబడులు జగన్ సంస్థల్లోకి వెళ్లాయని సిబిఐ ఇటీవల కోర్టులో దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్లో పేర్కొంది. ఈ పెట్టుబడులపై ఆర్వోసీ ప్రతినిధులు ఇచ్చిన సాక్ష్యాన్నీ పొందుపరించింది. దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంటూ క్విడ్ప్రోకో విధానంలో జగతిలోకి వచ్చిన అక్రమ పెట్టుబడులను మరోసారి కోర్టుకు తెలిపింది.
'2007 ఆగస్టు 8న హెటిరో సంస్థ జనని ఇన్ఫ్రాలో రూ.8 కోట్లు, జగతి పబ్లికేషన్స్లో రూ.1.5 కోట్లు పెట్టుబుడులు పెట్టింది. ఏడు నెలల తర్వాత ఆ సంస్థకు 2,45,535 షేర్లను కేటాయించారు. లాభనష్టాలతో పని లేకుండా పెట్టుబడులు పెట్టినందునే షేర్ల కేటాయింపులో జాప్యం జరిగినా ఆ సంస్థ పట్టించుకోలేదు. హెటిరో సంస్థ మూలధనం రిజర్వు నిధులు 2006 మార్చి 31 నాటికి రూ.182 కోట్లు. 144 కోట్ల మేర రుణాలున్నాయి.
ఈ స్థితిలో మూలధనం నుంచి ఇతర సంస్థల్లో పెట్టు బడులు పెట్టడానికి వీల్లేదు. అయినా ఆ సంస్థ పెట్టుబడులు పెట్టింది. ప్రతిగా తనకు దక్కిన షేర్ల విలువను బ్యాలెన్స్ షీట్లో చూపలేదు. అకౌంటింగ్ ప్రాథమిక నియమాలను పాటించలేదు. హెటిరో ల్యాబ్స్, హెటిరో హెల్త్కేర్ సంస్థల తీరు ఇలాగే ఉంది. ఇవన్నీ అక్రమ పెట్టుబడులే'నని సిబిఐ పేర్కొంది.
ఇక ట్రైడెంట్ జగతి పబ్లికేషన్స్లో రూ.7కోట్లు పెట్టుబడులుగా పెట్టింది. వాస్తవానికి సంస్థ నిర్వహణ నిధులు 2006-07కి రూ.5కోట్లు కాగా 2007-08 సంవత్సరానికి నిధులే లేవు. కేంద్రం సర్క్యులర్ ప్రకారం స్థిర విలువకంటే నిధులు తక్కువ ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టరాదు. దీన్ని ఈ సంస్థ ఉల్లంఘించింది. ఇక ట్రైడెంట్ ఫార్మాలో అరబిందో ఫార్మా పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొనడం కూడా పూర్తిగా అవాస్తవం. తన తండ్రి, అప్పటి ముఖ్యమంత్రి వైయస్ అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఈ కంపెనీలను జగన్ ప్రభావితం చేయడం వల్లే ఈ నిధులు అక్రమంగా తరలివచ్చాయని సిబిఐ తన చార్జిషీట్లో స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications