ఢిల్లీపై ఒత్తిడి, బాబుకు దెబ్బ: వలసలపై కెసిఆర్ పావులు

ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలతో తెరాస నేతలు సంప్రదింపులు జరుపుతూనే మరోవైపు ఒత్తిడి పెంచుతున్నారట. తెరాసలో చేరడానికి ఇదే సరైన సమయమంటూ వారికి హితబోధ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 27న నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ నాటికి గంగుల తరహాలో మరో ఇద్దరు, ముగ్గురి చేరికలు ఉంటాయంటున్నారు. ఎన్నికల నాటికి తెలంగాణలో కాంగ్రెస్, టిడిపి ఖాళీ అయ్యే స్థాయిలో తెరాసలోకి వలసలుంటాయంటున్నారు.
ఇందుకోసం పార్టీ నాయకత్వం బాగానే శ్రమిస్తోందట. ఈ చేరికల ప్రక్రియలో తెరాస నేతలు ఈటెల రాజేందర్, హరీశ్ రావు, కెటి రామారావు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తదితరులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారట. అవసరమైతే కెసిఆర్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారట. ఆయన వ్యూహంలో భాగంగానే ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, టిడిపి ఎమ్మెల్యేలపై తెరాస దృష్టి సారించిందట.
ఉన్న ఎమ్మెల్యేలందరినీ తమ వైపు తిప్పుకోగలిగితే టిడిపికి అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అంచనా వేస్తున్నారట. దీంతో తాము అనుకున్న విధంగా 15 లోక్సభ, 100 అసెంబ్లీ స్థానాలు గెల్చుకునేందుకు దారి ఏర్పర్చుకుంటున్నారంటున్నారు. ఈ దిశగానే పార్టీ నాయకత్వం పావులు కదుపుతోందని అంటున్నారు. అయితే ఎన్నికలు జరగడానికి కనీసం ఆరు నెలల ముందే ఈ వలసలను పూర్తి చేసుకొని పూర్తి స్థాయిలో ఎన్నికలపై దృష్టి పెట్టాలని కెసిఆర్ భావిస్తున్నారట.












Click it and Unblock the Notifications