చంద్రబాబు సభ: విశాఖకు చేరుకున్న బాలయ్య
ముగింపు సభలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేదిక వద్దకు తరలివస్తున్నారు. ముగింపు సభ కోసం 11 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. మరోవైపు అగనంపూడి టోల్గేట్ శివాజీపాలెం వద్ద 60 అడుగులు పైలాన్ స్థూపం తుది మెరుగులు దిద్దుకుంటోంది. పైలాన్ పక్కనే తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం మూడు గంటలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు స్థూపాన్ని ఆవిష్కరించనున్నారు.
తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, అనంతపురం, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్, విజయవాడల నుంచి ప్రత్యేక రైళ్లు విశాఖపట్నం చేరుకుంటాయి. మురళీమోహన్ వంటి తెలుగుదేశం నాయకులు కూడా విశాఖపట్నం చేరుకున్నారు.
తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ విశాఖపట్నం వస్తారా, రారా అనేది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్ శుక్రవారంనాడే విశాఖపట్నం చేరుకున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో జరిగిన ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు.