ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంఘం అధ్యక్షుడు శ్రీపతి కన్నుమూత
స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రభుత్వంలో శ్రీపతి రాజేశ్వర రావు మంత్రిగా పని చేశారు. ఎన్టీఆర్కు మంచి అభిమాని. ఆయన అఖిల భారత ఎన్టీఆర్ అభిమాన సంఘాన్ని స్థాపించారు. దానికి ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. అరవై ఏళ్ల క్రితమే ఆయన అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆయన వయస్సు 73.
మూడుసార్లు శాసనసభ్యులుగా గెలుపొందారు. రెండుసార్లు మంత్రిగా పని చేశారు. పార్టీ పెట్టక ముందు నుండే ఎన్టీఆర్తో శ్రీపతి రాజేశ్వర రావుకు మంచి అనుబంధముంది. ఎన్టీఆర్ యువసేన పేరుతో ఆయన ఎన్టీఆర్తో అనుబంధం పెంచుకున్నారు. ఆయన ప్రస్తుతం సనత్ నగర్లో ఉంటున్నారు.
మృతదేహాన్ని స్వగృహానికి తరలించారు. రేపు బన్సీలాల్ పేట స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. శ్రీపతి రాజేశ్వర రావు మృతికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టిడిపి నేత, హీరో నందమూరి బాలకృష్ణలు సంతాపం తెలిపారు.
మొదటి నుండి ఎన్టీఆర్ అభిమానిగా ఉన్న శ్రీపతి రాజేశ్వర రావు 1982లో ఎన్టీఆర్ టిడిపిని స్థాపించినప్పుడు అభిమాన సంఘాలను సమన్వయపర్చారు. శరీరంపై ఎన్టీఆర్ పచ్చబొట్లు పొడిపించుకొని అభిమానం ప్రదర్శించారు. ఎన్టీఆర్ కుటుంబంతో శ్రీపతికి మంచి అనుబంధముంది.