జూ.ఎన్టీఆర్, హరికృష్ణలతో చంద్రబాబు కటీఫ్?
ఎబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు మాట్లాడిన తీరు ఆ విషయాన్ని పట్టిస్తోంది. హరికృష్ణతో ఎలాంటి వివాదం లేదని, అతను విశాఖలో పాదయాత్ర ముగింపు సభకు ఎందుకు రాలేదో తెలియదని, ఆయనే చెప్పాలని, కుటుంబమంతా కలిసి ఉండాలని తాను కోరుకుంటున్నానని, అందరికీ గౌరవం ఇస్తానని చెప్పారు. అయితే రాజకీయాలు వేరు, కుటుంబం వేరని, పార్టీకి ఎవరు ఇబ్బందులు తేవద్దన్నారు.
బాలకృష్ణకైనా, ఎవరికైనా తాను ముక్కుసూటిగా ఉన్న విషయం చెప్తానని, అది కూడా పార్టీ కోసమేనని చంద్రబాబు అనడాన్ని బట్టి ఎవరూ తనపై ఒత్తిడి చేయకూడదని, పార్టీ కోసం అంతా పనిచేయాల్సిందేనని చెప్పారు. తద్వారా, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ తనపై ఒత్తిడి పెట్టవద్దని, వారంత వారుగా పనిచేస్తే తానే గుర్తిస్తే ఏదైనా పదవి ఇస్తే తీసుకోవాలని, లేదంటే కిమ్మనకూడదని ఆయన చెప్పినట్లు అర్థం చేసుకుంటున్నారు.
హరికృష్ణ ఇటీవల విశాఖపట్నంలో జరిగిన చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభకు గైర్హాజరైన విషయం తెలిసిందే. చంద్రబాబు హరికృష్ణను ఆయన మానానికే వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది. హరికృష్ణ దూరం కావడంతో ఆయన సోదరుడు, తన వియ్యంకుడు బాలకృష్ణను చంద్రబాబు ముందుకు తెస్తున్నారు. బాలకృష్ణకు ఇచ్చే పదవిపై కూడా ఆయన స్పష్టత ఇవ్వలేదు. వారి వారి ఆసక్తులను బట్టి బాధ్యతలపై స్పష్టత ఇస్తామని, పార్టీయే సుప్రీమని ఆయన అన్నారు.
పార్టీ సుప్రీం అనడం ద్వారా చంద్రబాబు అందరూ తన మాటకు కట్టుబడి ఉండాలనే అర్థాన్ని ఇస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ మాట అంటే చంద్రబాబు మాట అనే విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు మాటనే పార్టీ మాటగా చెలామణి కావడం తెలుగుదేశం పార్టీలో కొత్త కాదు. అలాగే, తన మాటకు విలువ ఇచ్చి, తనను గౌరవిస్తూ, మారు మాట్లాడకుండా పనిచేయడానికి ఇష్టపడితేనే హరికృష్ణ గానీ జూనియర్ ఎన్టీఆర్ గానీ తిరిగి రావడానికి వీలుంటుందనే అర్థాన్ని చంద్రబాబు ఇచ్చినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద, హరికృష్ణకు గానీ జూనియర్ ఎన్టీఆర్కు పార్టీలో ఇక ప్రాధాన్యం ఉండదనేది స్పష్టమవుతోందని అంటున్నారు.