కర్నాటక పోల్స్: కిరణ్ 'అవినీతి'కి కిషన్ రెడ్డి కౌంటర్
సంకీర్ణ ప్రభుత్వాలతో ప్రజలు విసిగిపోయారని, అందుకే తమ పార్టీకి పట్టం కట్టేందుకు నిర్ణయించుకున్నారన్నారు. కర్నాటక - ఆంధ్రప్రదేశ్ జల వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని చెప్పారు. తెలంగాణ అంశం కేంద్రం పరిధిలో ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అందరితో చర్చించిన తర్వాత అధిష్టానం ఈ అంశంపై ఓ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. బిజెపిది అవినీతి పాలన అన్నారు.
కిషన్ రెడ్డి కౌంటర్
కర్నాటకలో బిజెపిది అవినీతిపాలన అని, కర్నాటక అవినీతి మంత్రులు ఎపి జైళ్లలో ఉన్నారన్న కిరణ్ వ్యాఖ్యలకు భారతీయ జనతా పార్టీ ఎపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాదులో ఘాటుగా స్పందించారు. ఎపిలో తమ అవినీతి కప్పిపుచ్చి బిజెపిపై ఆరోపణలు చేయడం విడ్డూరమన్నారు. ఇక్కడి మంత్రులు కొందరు జైళ్లలో, మరికొందరు సిబిఐ చక్రబంధంలో ఉన్నారని విమర్శించారు.
వారు అవినీతికూపంలో ఇరుక్కుపోయి తమను విమర్శించడమేమిటన్నారు. కిరణ్కు నైతిక హక్కు లేదన్నారు. పొత్తులతో తాము విసిగిపోయామని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్నారు. నాగర్ కర్నూలు శాసనసభ్యుడు నాగం జనార్ధన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించామని, ఆయనే నిర్ణయం తీసువాలన్నారు.
టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు స్వతంత్రంగా ముఖ్యమంత్రి కాలేదన్నారు. బిజెపితో పొత్తు చారిత్రక తప్పిదమని ఆయన చెప్పడం సరికాదన్నారు. తమతో పొత్తు పెట్టుకోమని ఆయనకు ఎప్పుడు చెప్పలేదన్నారు. రాష్ట్రంలో అవినీతి మంత్రుల రాజ్యం నడుస్తుంటే మన సిఎం కర్నాటకలో నీతులు వల్లిస్తున్నారని ఎద్దేవా చేశారు.