ధైర్యం చెప్తున్న విజయమ్మ: నాలా వైఎస్ కాదని బాబు
జగన్ వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను కొనసాగిస్తారన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చాక అందరి సమస్యలు తీరుతాయన్నారు. మూడేళ్లుగా రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కుంటుపడిందన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి అన్నారు. అందుకే ఆయన ఛార్జీలు పెంచకుండా పాలించారన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టిందన్నారు. అమ్మ హస్తం పేరుతో మాయా హస్తాన్ని ప్రజలకు చూపిస్తున్నారని విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. ప్రజల కోసం పని చేసే నాయకులు రాష్ట్రంలో రావాల్సిన అవసరముందన్నారు.
నేను ఇలా... వైయస్ అలా...: చంద్రబాబు
తాను పరిశ్రమల స్థాపన కోసం తన హయాంలో భూములను ఇచ్చానని, తమ హయాంలో పెట్టిన కంపెనీలు పని చేస్తున్నాయని, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కూడా వాటిల్లో పెరిగాయని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏడు నెలల తర్వాత ఆయన ఎన్టీఆర్ ట్రస్టు భవనంలో అడుగుపెట్టారు. ఆయనకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. మేడే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
తాము ఉపాధి, ఉద్యోగావకాశాల కోసం భూములను కేటాయించామన్నారు. వైయస్ హయాంలో జేబులు నింపుకొని భూములను ఇచ్చారన్నారు. క్విడ్ ప్రోకో జరిగిందని తేలుతుందన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే నిర్దిష్ట ప్రణాళికతో కార్మికల సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలను వేలం వేసి అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
జగన్ను కలిసిన మణిగాంధీ
కాంగ్రెసు పార్టీ మాజీ ఎమ్మెల్యే శిఖామణి తనయుడు, ప్రస్తుత టిడిపి నేత మణిగాంధీ చంచల్గూడ జైలులో ఉన్న వైయస్ జగన్మోహన్ రెడ్డిని బుధవారం కలిశారు. ఆయన వెంట వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు భూపాల్ రెడ్డి, చంద్రశేఖర రెడ్డిలు ఉన్నారు. కాంగ్రెసు, టిడిపిలు కుమ్మక్కై రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నాయన్నారు. త్వరలో జగన్ బయటకు వస్తారని, మరికొంతమంది నేతలు జగన్ పార్టీలో చేరుతారన్నారు.