రెబల్స్టార్ని నెట్టేసిన రాహుల్, అలక:సుమలత వివరణ
బెంగళూరు: ఏఐసిసి ఉపాధ్యక్షురాలు రాహుల్ గాంధీ పర్యటనలో మాండ్య నియోజకవర్గం కాంగ్రెసు పార్టీ అభ్యర్థి, రెబల్ స్టార్ అంబరీష్కు చేదు అనుభవం ఎదురయింది. ఈ రోజు మాండ్య నియోజకవర్గంలో రాహుల్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీతో పాటు ఎస్ఎమ్ కృష్ణ, అంబరీష్, సుమలత పాల్గొన్నారు.
అయితే, వేదిక పైకి వచ్చిన అంబరీష్కు రాహుల్ అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. అంబరీష్ తన ప్రక్కకు రాగానే రాహుల్ ఆయనను పక్కకు తప్పించి మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణను తన ప్రక్కన కూర్చోబెట్టుకున్నారు. మరో కాంగ్రెసు నేత కూడా అంబరీష్ను వెనక్కి పంపించి వేసే ప్రయత్నాలు చేశారు.

దీంతో అసంతృప్తికి గురైన అంబరీష్ వేదిక దిగి వెళ్లిపోయారు. మరో ఆసక్తికరమైన విషయమేమంటే భర్త అలిగి వెళ్లినప్పటికీ అంబరీష్ సతీమణి సుమలత సభ పూర్తయ్యేంత వరకు కూర్చున్నారు. అంబరీష్ పట్ల రాహుల్ ప్రవర్తనపై ఆయన అభిమానులు మండిపడ్డారు. అంబరీష్కు ప్రాధాన్యత ఇవ్వకుండా కృష్ణకు ఇవ్వడమేమిటని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎస్ఎం కృష్ణ మాండ్య జిల్లాలో పోటీ చేస్తే ఓడించేందుకు సిద్ధంగా ఉన్నామని మండిపడ్డారు. రాహుల్ గాంధీ తీరు చూసిన పలువురు ఆయన అంబరీష్ కంటే సీనియర్ నేత అయిన ఎస్ఎం కృష్ణకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. కాగా, అంబరీష్, ఎస్ఎం కృష్ణల మధ్య ఎప్పటి నుండో కోల్డ్ వార్ జరుగుతోంది.
సుమలత వివరణ
అంబరీష్ వేదిక దిగి వెళ్లడంపై సుమలత వివరణ ఇచ్చారు. అంబరీష్, ఎస్సెమ్ కృష్ణల మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. ఎన్నికల నిబంధనలకు సంబంధించిన అంశంతోనే అంబరీష్ వెళ్లిపోయారని చెప్పారు.












Click it and Unblock the Notifications