మద్దతేకాదు: జైపాల్కు కోమటిరెడ్డి, అదో డ్రామా: ఎర్రబెల్లి
ఎంపీలది డ్రామా
కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సబ్యులు దీక్ష పేరుతో ఢిల్లీలో పార్లమెంటు గేటు వద్ద డ్రామా చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, టిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర రావు ధ్వజమెత్తారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి పార్లమెంటు ఎదుట తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు.
చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో దీక్ష చేయాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి పార్లమెంటు సమావేశాల్లో పాల్గొనకుండా సీట్లు, నోట్ల కోసం సభలు, సమావేశాలతో కాలం వెళ్లదీస్తున్నారన్నారు.
కెసిఆర్ మాటలు నమ్మి ఐక్యకార్యాచరణ సమితి తప్పుదారిన నడుస్తుందన్నారు. ఇప్పటికైనా పార్టీల నిజస్వరూపం తెలుసుకొని తెలంగాణ కోసం చిత్తశుద్ధితో ఉద్యమిస్తున్న వారినందరిని కలుపుకొని పోవాలని హితవు పలికారు.