చంద్రబాబుకు రెస్టివ్వని దాడి: కెసిఆర్పై జగ్గారెడ్డికి ఛాన్స్

టిడిపిలో ముప్ప ఏళ్లుగా ఉన్న దాడి గురువారం తన రాజీనామా లేఖను చంద్రబాబుకు మెయిల్ చేశారు. పార్టీలో నుండి వెళ్లడం బాధగా అనిపించినా తప్పడం లేదని దాడి చెబుతున్నారు. అతను రేపు జైలులో ఉన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆ తర్వాత ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఉత్తరాంధ్రలో దాడి కీలక నేత. అలాంటి నేత పార్టీని వీడటం బాబు జీర్ణించుకోలేకపోతున్నారు.
దీంతో విశ్రాంతి తీసుకోవాలనుకున్న బాబు పార్టీ సీనియర్లతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నెలలుగా నడవడంతో ఆయన ఆరోగ్యం బాగా లేదని చెప్పిన వైద్యులు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే, దాడి వ్యవహారం ఆయనను విశ్రాంతి తీసుకోనివ్వలేదు. ఆయన హఠాత్తుగా ఈ రోజు పార్టీ సీనియర్ నేతలతో భేటీ అయ్యారు. దాడి పరిణామంపై ప్రధానంగా చర్చించారు.
అందుబాటులో ఉన్న సీనియర్ నేతలు బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, మోత్కుపల్లి నర్సింహులు, కెఎస్ రత్నం, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, లాల్ జాన్ భాషా, అరవింద్ గౌడ్, శ్రీరామ్ తదితరులతో బాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో పలు అంశాలు బాబు చర్చించినట్లుగా సమాచారం. మే 7న పార్లమెంటులో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ ఉంది.
స్పీకర్ మీరా కుమార్ టిడిపి అధినేతను ఆహ్వానిస్తూ లేఖ రాశారు. ఈ అంశంతో పాటు సీమాంధ్రలో జగన్ పార్టీని తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితిని ఎదుర్కొనే అంశంపై చర్చించినట్లుగా సమాచారం. అలాగే దాడి పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఉత్తరాంధ్రలో పార్టీని సమాయత్తపర్చాల్సిన అంశంతో పాటు స్థానిక నేతలకు ఇవ్వాల్సిన భరోసా పైన ఆయన చర్చించినట్లుగా తెలుస్తోంది.
పార్టీని వీడిన దాడిపై టిడిపి ఎదురు దాడికి దిగింది. దాడి టిడిపికి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరడం హాస్యాస్పదమన్నారు. ఆయన ప్యాకేజీ కోసమే, పదవుల కోసమో ఆ పార్టీలో చేరుతున్నారన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి అవినీతి పైన రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకాన్ని తీసుకు వచ్చిన నేతలు జగన్ పార్టీ పంచన చేరడం శోచనీయమంటున్నారు.
జగన్ పార్టీలోకి నో ఎంట్రీ
మరోవైపు జగన్ పార్టీలోకి వెళ్తానని దాడి వీరభద్ర రావు చెబుతుండగా.. తమ పార్టీలోకి రానివ్వమని కొణతాల రామకృష్ణ వర్గం చెబుతోంది. దాడి వీరభద్ర రావు పార్టీలోకి రాకుండా ఉండేందుకు తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి నచ్చచెబుతామని వారు అంటున్నారు. కొణతాల రామకృష్ణ అసంతృప్తితోనే.. జగన్ మాటే మా మాట అంటున్నారు.
కెసిఆర్పై జగ్గారెడ్డి
తెలంగాణ రాష్ట్ర సమితి చేపట్టిన నేటి మెదక్ జిల్లా బందు పాక్షికంగానే జరిగిందని చెప్పవచ్చు. జిల్లాలో చాలా చోట్ల వ్యాపార సంస్థలు తెరుచుకున్నాయి. బస్సులు యథావిధిగా నడిచాయి. సిద్దిపేట, గజ్వేల్ తదితర ప్రాంతాల్లో తెరాస కార్యకర్తలు బస్సులను అడ్డుకొని, దుకాణాలను మూయించారు. హరీష్ రావుతో సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా పాక్షికంగా జరిగినా సంగారెడ్డిలో మాత్రం ఆ ప్రభావం కనిపించలేదంటున్నారు.
కెసిఆర్ అంటేనే నిప్పులు చెరిగే జగ్గారెడ్డికి ఇది ఓ అవకాశంగా దొరికింది. కెసిఆర్ సొంత జిల్లాలోనే ఫెయిలయ్యారని, ఆయన బందు పిలుపుకు జిల్లా ప్రజల నుండి ఏమాత్రం స్పందించలేదని, దీంతో తెలంగాణవాదం వేరు.. తెరాస వేరు అని అర్థమైపోయిందని ఆయన చెబుతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని వ్యతిరేకిస్తున్న మంత్రుల తీరును ఆయన తప్పు పట్టారు. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు.












Click it and Unblock the Notifications