కిరణ్ రెడ్డిపై పోరు: జానారెడ్డి రివర్స్, ఢిల్లీకి బొత్స
వైయస్ మించిన నేత కిరణ్: జానారెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్ల తన వైఖరిని సీనియర్ మంత్రి కె. జానారెడ్డి మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి వైయస్ రాజశేఖర రెడ్డి కన్నా గొప్పవాడని ఆయన సోమవారం చిత్తూరు జిల్లాలో అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డితో తనకు ఏ విధమైన అభిప్రాయభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి తాను పర్యటిస్తానని, 6 వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలు నిర్వీర్యమవుతాయని పార్టీలన్నీ అభిప్రాయపడ్డాయని, అయితే సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కిరణ్ కుమార్ రెడ్డిని మించినవారు లేరని ఆయన కితాబు ఇచ్చారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెసును గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెసు ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ఆయన అన్నారు.
ఢిల్లీకి బొత్స సత్తిబాబు
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రేపు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. సీనియర్ మంత్రుల వ్యవహారంపై అధిష్టానం పెద్దలతో ఆయన నేరుగా చర్చించే అవకాశాలున్నాయి. ఈ వ్యవహారంపై ఆయన ఇదివరకే నివేదికును పంపినట్లు చెబుతున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్ష వ్యవహారంపై సీనియర్ మంత్రులు మండిపడుతున్నారంటూ ఆయన ఆ నివేదిక పంపించారని అంటున్నారు. పార్లమెంటు ఆవరణలో ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యే అవకాశం ఉంది.
బొత్సతో రఘువీరా భేటీ
పిసిసి అధ్యక్షుడు అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో మంత్రులు ఆనం రాంనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి సోమవారం ఉదయం సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డిపై తమకు వ్యతిరేకత లేదని, అప్పుడప్పుడు తాము ఇలా కలుసుకుంటుంటామని, ఈ భేటీ వెనుక ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని రఘువీరారెడ్డి భేటీ తర్వాత మీడియా ప్రతినిధులతో అన్నారు. రఘువీరా రెడ్డి కూడా కిరణ్ కుమార్ రెడ్డిపై అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
9న ఎంపిలతో రాహుల్ సమావేశం
కాగా, రాష్ట్ర పార్లమెంటు సభ్యులతో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ నెల 9వ తేదీన సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల మధ్య ఈ సమావేశం జరుగతుందని కాంగ్రెసు వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ, ముఖ్యమంత్రి వ్యవహారశైలి, రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై ఆయన పార్లమెంటు సభ్యులతో మాట్లాడే అవకాశం ఉందని అంటున్నారు.
ఇదిలా వుంటే, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం సాయంత్రం గవర్నర్ నరసింహన్ను కలిశారు. తాజా పరిణామాలను ఆయన గవర్నర్కు వివరించినట్లు సమాచారం.