షర్మిల యాత్ర: మాజీ ఎమ్మెల్యేని తోసేసిన సెక్యూరిటీ
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అశ్వారావుపేట నియోజకవర్గ ఇన్చార్జి తాటి వెంకటేశ్వర్లుకు అవమానం ఎదురైందట. ఇక్కడ ఏర్పాటు చేసిన దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆదివారం షర్మిల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హజరయ్యేందుకు వచ్చిన వెంకటేశ్వర్లును షర్మిల భద్రతా సిబ్బంది అడ్డుకుని, పక్కకు నెట్టివేశారు. దీంతో మనస్తాపానికి గురైన వెంకటేశ్వర్లు అలిగి అక్కణ్నుంచీ వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు షర్మిల పాదయాత్రలో రోప్ పార్టీ సెక్యూరిటీ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని.. ముఖ్యనాయకులని కూడా చూడకుండా నెట్టివేస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. వెంకటేశ్వర్లుకు చేదు అనుభవం ఎదురవడం పట్ల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాగా, పాదయాత్ర చేస్తున్న షర్మిల కాంగ్రెసు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్రంలో అయితే ఛార్జీషీటులో పేరున్న మంత్రిది తప్పట.. ప్రధానిది తప్పు లేదట, రాష్ట్రంలో మాత్రం ఛార్జీషీటులో ఉన్న మంత్రులది తప్పులేదట అని విమర్శించారు. కేంద్రంలో ఓ న్యాయం, రాష్ట్రంలో మరో న్యాయమా అని ప్రశ్నించారు.