కిరణ్ రెడ్డితో ఢీ: చిరంజీవి విందు రాజకీయం, బొత్స సైతం

తాజాగా, సోమవారం రాత్రి చిరంజీవి మంత్రులకు విందు ఇచ్చారు. ఈ విందుకు బొత్స సత్యనారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరా రెడ్డి హాజరయ్యారు. చిరంజీవి విందులో రాజకీయాలేవీ లేవని, కర్ణాటక ఎన్నికల ప్రచారంలో తనతోపాటు పాల్గొన్న మంత్రులకు విందు ఇచ్చారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మంత్రి రఘువీరా కూడా ఇదే చెబుతున్నారు.
అయితే, ఆ మాటలను ఎవరూ విశ్వసించడం లేదు. ఇటీవలికాలంలో ముఖ్యమంత్రి వ్యవహారశైలిని వ్యతిరేకిస్తున్న నేతలు తరచూ భేటీ కావడం కాంగ్రెస్ పార్టీలో ఆసక్తిని రేపుతోంది. చిరంజీవికి సన్నిహితుడైన సి. రామచంద్రయ్య ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు, ఈ సమావేశాల తీరు కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెసులో చిరంజీవి నాయకత్వంలో ఓ వర్గం ఏకం అవుతున్నాయనే విషయాన్ని తెలియజేస్తోందని అంటున్నారు. రాష్ట్ర ప్రజలు చిరంజీవి వైపు చూస్తున్నారని సి. రామచంద్రయ్య ఇటీవల అన్నారు. అదే సమయంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత చిరంజీవికి ఉందని కూడా ఆయన అన్నారు.
చిరంజీవితో సమావేశాన్ని రఘువీరా రెడ్డి సమర్థించుకున్నారు. ఇవన్నీ అంతర్గత సమావేశాలని, కేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రులు సమావేశం కావడం సర్వసాధారణమని రఘువీరారెడ్డి అన్నారు. తామేమీ ఇతర పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, జగన్లతో సమావేశం కావడం లేదని ఆయన అన్నారు.
కాగా, కిరణ్తో మంత్రులు రఘువీరా రెడ్డి, డీకే అరుణ, గంటా శ్రీనివాసరావు, దానం నాగేందర్, పి.సుదర్శన్రెడ్డి మంగళవారం విడివిడిగా భేటీ అయ్యారు.












Click it and Unblock the Notifications