గాలి ఎఫెక్ట్: జైల్లో టీవిలకి అతుక్కుపోయిన విఐపి ఖైదీలు
అక్రమ మైనింగు కేసులో గాలి జనార్ధన్ రెడ్డి సంవత్సరంన్నర క్రితం అరెస్టై చంచల్గూడ జైలులో ఉంటున్న విషయం తెలిసిందే. గాలి ప్రధాన అనుచరుడు బిజెపిని వీడి గాలికి మద్దతుగా బిఎస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించారు. బిఎస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభావం ఎన్నికల్లో ఏ మేరకు ఉంటుందోనని విఐపి ఖైదీలు ఉత్కంఠగా ఎన్నికల లెక్కింపు పూర్తయి ఫలితాలు పూర్తిగా వచ్చే వరకు టివిలకే అతుక్కుపోయారట.
ఈ ఎన్నికల్లో బిఎస్సార్ కాంగ్రెసు పార్టీ కేవలం నాలుగు స్థానాలలో మాత్రమే గెలుపొందింది. తమకు బాగా పట్టున్న బళ్లారిలోను వారు ఎక్కవగా ప్రభావం చూపలేకపోయారు. బిఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎన్నికల్లో ప్రభావం చూపకపోవడంతో విఐపి ఖైదీలు పలువురు నిరాశలో మునిగిపోయారట. గాలి సోదరుడు సోమశేఖర రెడ్డి సైతం హర్సనహళ్లి నుండి పోటీ చేసి ఓటమి చెందడంతో కొందరు జైలు గదుల నుండి బయటకు రాలేదట. బిఎస్సార్ పార్టీ నుండి పోటీ చేసిన ప్రముఖ నటి పూజా గాంధీ సైతం దారుణ ఓటమి చెందిన విషయం తెలిసిందే.
కాగా, మొత్తం 30 జిల్లాలకు గాను 11 జిల్లాల్లో జెడిఎస్, 12 జిల్లాల్లో బిజెపి ఖాతాలు తెరవలేదు. యడ్యూరప్ప ఆధ్వర్యంలోని కెజెపి 6 జిల్లాలకే పరిమితమైంది. బిఎస్సార్ కాంగ్రెస్ కేవలం 3 జిల్లాల్లో నామమాత్ర ప్రభావం చూపింది. కాంగ్రెస్ పార్టీ హవా మొత్తం అన్ని చోట్ల కొనసాగింది. బెంగళూరు అర్బన్లో కాంగ్రెస్కు 13, బిజెపికి 12 స్థానాలు దక్కాయి. ఉత్తర కర్ణాటకలో బలమైన లింగాయత నేతగా ఉన్న యడ్యూరప్ప కొన్ని జిల్లాల్లో ఖాతా కూడా తెరవలేకపోవడం విశేషం.
బిజెపి ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన 12 మంది ఓటమి పాలయ్యారు. వారిలో ఉప ముఖ్యమంత్రి కెఎస్ ఈశ్వరప్ప కూడా ఉన్నారు. కాంగ్రెస్లోనూ పిసిసి చీఫ్ పరమేశ్వర, కేంద్ర మాజీమంత్రి ఇబ్రహీం ఓడిపోయారు. బిఎస్సార్ కాంగ్రెస్ తరఫున పోటీచేసిన ప్రముఖ నటి పూజాగాంధీ రాయచూరులో ఓటమి పాలయ్యారు.
కాంగ్రెస్కు పూర్తి మెజారిటీ రాకపోతే మద్దతిచ్చి ఉప ముఖ్యమంత్రి అవుదామనుకున్న యడ్యూరప్ప సన్నిహితురాలు శోభా కరంద్లాజే రాజాజీనగర్లో ఓటమి చవిచూశారు. ఎంపీలుగా కొనసాగుతూ అసెంబ్లీకి పోటీ పడ్డ నలుగురిలో ముగ్గురు విజయం సాధించారు. బెంగళూరు సెంట్రల్ ఎంపీగా ఉన్న పీసీ మోహన్ గాంధీనగర్ నియోజకవర్గంనుంచి పోటీ చేసి ఓడిపోయారు.