కర్నాటక సిఎంగా సిద్ధరామయ్య, డిసిఎంలుగా ఇద్దరు

ఆయనతో పాటు ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని పార్టీ అధిష్టానం భావిస్తోందని సమాచారం. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా నియమించిన కాంగ్రెసు పార్టీ అధిష్టానం కుల సమీకరణాలను అమలు చేయనుందంటున్నారు. లింగాయత్, కురవ, గౌడ ఫార్ములాను కాంగ్రెసు పాటిస్తోంది.
కాగా అంతకుముందు ముఖ్యమంత్రి పదవి రేసులో చాలామంది నేతలు చేరిపోయారు. సిద్ధరామయ్య, మల్లికార్జున ఖర్గే తదితరులు ఈ రేసులో నిలిచారు. ముఖ్యమంత్రి పదవి రేసులో ముందంజలో ఉన్న సిద్దరామయ్య బెంగళూరులో గురువారం రోజంతా బిజీబిజీగా గడిపారు. ఉదయం నుంచే ఆయన నివాసం ఎమ్మెల్యేలు, అభిమానులతో కిటకిటలాడింది. అనంతరం సీన్ ఓ ప్రైవేట్ హోటల్కు మారింది. తనకు మద్దతునిస్తున్న దాదాపు డెబ్బై మంది ఎమ్మెల్యేలతో సిద్దరామయ్య రహస్య సమాలోచనలు జరిపారు.
ఎన్నికలో ఓడిపోయినంత మాత్రాన తనను తక్కువ అంచనా వేయొద్దని, తాను ఇప్పటికీ ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నానని కెపిసిసి చీఫ్ పరమేశ్వర ప్రకటించడం విశేషం. దళితుడికి ఈసారి సిఎం పదవి కట్టబెట్టాలనే వాదనను మల్లిఖార్జున ఖర్గే లేవనెత్తారు. ఆయన తనకు సిఎం పదవి కోసం పావులు కదిపారు. కర్ణాటక రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన మాజీ మంత్రి డికె శివ కుమార్ కూడా చక్రం తిప్పారట. ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దిసేపటికే ఆయన సిఎం పదవిపై తనకున్న ఆశలను బద్దలుకొట్టినట్టు చెప్పారు.
టిటిడి బోర్డు సభ్యుడు, మాజీ మంత్రి ఆర్వి దేశ్పాండే కూడా సిఎం పదవి రేసులో తానూ ఉన్నట్లు ప్రకటించారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నానని చెప్పుకొచ్చారు. మరో సీనియర్ నేత, సిఎల్పీ ఉప నేత టిబి జయచంద్ర సైతం రేసులోకొచ్చారు. ఆరుసార్లు శాసనసభకు ఎన్నికైన తనకూ ముఖ్యమంత్రి పదవిపై ఆశ ఉందని ప్రకటించారు. అయితే వీరంతా అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటించడం కొసమెరుపు. చివరకు తీవ్ర తర్జన భర్జన అనంతరం సిద్ధరామయ్యను అధిష్టానం ఎంపిక చేసింది.












Click it and Unblock the Notifications