కడియం, దాడి: చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ
తాను ఏం తక్కువ చేశానని కడియం శ్రీహరి పార్టీకి రాజీనామా చేశారని చంద్రబాబు తనను కలిసిన నాయకులతో అంటున్నట్లు తెలుస్తోంది. దాడి వీరభద్ర రావు పార్టీని వీడిన వేడి తగ్గకుండానే కడియం శ్రీహరి దిగ్భ్రాంతికి గురి చేశారు. కడియం శ్రీహరిని ఇటు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పాటు అటు బిజెపి కూడా దువ్వుతోంది. అయితే, తెరాసలో చేరాలని ఆయన ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును కలిసిన తర్వాతనే ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్లు చెబుతున్నారు.
కాగా, చంద్రబాబుపై నాయకులకు క్రమంగా విశ్వాసం సన్నగిల్లుతున్నట్లు కనిపిస్తోంది. తిరిగి పార్టీని అధికారంలోకి తెస్తారనే అపనమ్మకం కారణంగానే నాయకులు పార్టీని వీడుతున్నట్లు చెబుతున్నారు. కడియం శ్రీహరి శాసనసభ్యుడు కాకపోయినప్పటికీ పార్టీలో ముఖ్యమైన నాయకుడు. ఆయన పార్టీని వీడిన ప్రభావం తీవ్రంగానే పడుతుంది.
కడియం శ్రీహరిపై తెలంగాణకు చెందిన నాయకులు మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి కాస్తా తీవ్రంగానే ప్రతిస్పందించినట్లు కనిపించినా టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండనలో వాడి లేదు. కడియం శ్రీహరి రాజీనామా చేసిన తర్వాత ఎర్రబెల్లి దయాకర్ రావు చంద్రబాబును కలిశారు. తెలంగాణ ఫోరం కన్వీనర్ పదవికి రాజీనామా చేయడానికే ఆయన చంద్రబాబును కలిసినట్లు ఊహాగానాలు కూడా చెలరేగాయి. అంటే, పార్టీలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఎవరు ఎప్పుడు పార్టీని వీడిపోతారో తెలియని పరిస్థితి ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా టిడిపి అధికారంలోకి రాలేదనే అంచనాకు రావడం వల్లనే నాయకులు పార్టీని వీడుతున్నట్లు చెబుతున్నరు. గత తొమ్మిదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీని మోయడం వారికి కష్టంగా ఉన్నట్లు చెబుతున్నారు.
చంద్రబాబు ఏకపక్ష నిర్ణయాలు ఇబ్బంది పెడుతున్నట్లు చెబుతున్నారు. పార్టీలో చంద్రబాబు చుట్టూ చేరిన నాయకుల కారణంగా మిగతా నాయకులు దగ్దరకు చేరలేని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. చంద్రబాబు మార్కుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. చాలా మంది నాయకులు పార్టీలో ఉన్నప్పటికీ చురుగ్గా వ్యవహరించడం లేదు. ఇది చంద్రబాబుకు పెద్ద సమస్యగా మారింది.
తెలంగాణలోనే కాకుండా సీమాంధ్రలోనూ అదే పరిస్థితి ఉందని అంటున్నారు. కృష్ణా జిల్లాలో వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్ రావు ఉదంతాలను వారు ఉదహరిస్తున్నారు. దేవినేని ఉమామహేశ్వర రావు కారణంగా వారు పార్టీకి దూరమయ్యే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. కలిసికట్టుగా పనిచేయడానికి బదులు చంద్రబాబుకు సన్నిహితులైన నాయకులు జిల్లాల్లో ముఠాలు కడుతున్నారనే అభిప్రాయం ఉంది. ఇది పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుందని అంటున్నారు.