బాబు ఫిర్యాదు: గవర్నర్ నమస్కారం పెట్టి నవ్వారు

గవర్నర్తో భేటీ తర్వాత ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కళంకిత మంత్రుల పట్ల గవర్నర్ నరసింహన్ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆయన విమర్శించారు. జగన్ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులు కొనసాగడానికి అనర్హులని ఆయన అన్నారు. ఈ విషయాన్ని తాము ఇంతటితో వదలబోమని, మంత్రులను తప్పించేంత వరకు ఉద్యమం చేస్తామని ఆయన చెప్పారు.
కళంకిత మంత్రులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ను కోరినట్లు ఆయన తెలిపారు. జగన్ ఆస్తుల కేసులో సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్లలో పేర్లున్న మంత్రులు కొనసాగడానికి వీలు లేదని ఆయన అన్నారు. తీవ్రవాద సమస్య కన్నా అవినీతి ప్రమాదకరమైందని ఆయన వ్యాఖ్యానించారు. కళంకిత మంత్రులను తొలగించాలని గవర్నర్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆదేశించాలని, ముఖ్యమంత్రి తొలగించకపోతే గవర్నర్ వారిని డిస్మిస్ చేయాలని చంద్రబాబు అన్నారు.
జలయజ్ఞం, గనులు, సెజ్ల కేటాయింపుల్లో అవినీతి చోటు చేసుకుందని ఆయన అన్నారు. ఆరుగురు మంత్రులపై ఆరోపణలు వచ్చాయని, ముగ్గురిని నిందితులుగా చేరుస్తూ సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసిందని ఆయన గుర్తు చేశారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న హోం మంత్రి సబితా ఇద్రారెడ్డి పదవిలో కొనసాగడాన్ని, ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆమోదించకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు.












Click it and Unblock the Notifications