తన మార్క్ కోసం..: సోనియాతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ
కిరణ్ మంత్రి వర్గ విస్తరణ కోసం ఎప్పటి నుండే ప్రయత్నాలు చేస్తున్నారు. తన మార్క్ మంత్రివర్గం కోసం ఆయన చాలా రోజుల నుండి పట్టుబడుతున్నారు. అధిష్టానం పలు కారణాలు చెప్పి దానిని వాయిదా వేస్తూ వస్తోంది. ఇప్పుడు మరోసారి కిరణ్ విస్తరణపై ఆశలు పెట్టుకున్నారు. సోనియా అంగీకరిస్తే భారీగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి.
పిసిసి కార్యవర్గం పైన కూడా ఆయన దృష్టి సారించినట్లుగా సమాచారం. అదే సమయంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జోడు పదవుల అంశాన్ని ఆయన మేడం దృష్టికి తీసుకు వెళ్లనున్నారని అంటున్నారు. బొత్సను ఏదో ఒక పదవిలో ఉండమని ఆదేశిస్తే... ఖాళీ అయిన స్థానంలో తనకు అనుకూలురైన వారిని తీసుకోవాలని కిరణ్ భావిస్తున్నారట.
ముఖ్యమంత్రి గురువారం నుండి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆయన కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గులాం నబీ ఆజాద్తో రాత్రి భేటీ అయ్యారు. ఆయనతో పాటు బొత్స సత్యనారాయణ కూడా ఉన్నారు. ఈ రోజు రాత్రి ఆజాద్ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రాత్రిలోగా విస్తరణ, కళంకిత మంత్రులు, పిసిసి కార్యవర్గం తదితర అంశాలు కొలిక్కి వస్తాయంటున్నారు.