కళంకితులకు చోటివ్వని సిఎం సిద్ధ: నిరసన జ్వాలలు
ఢిల్లీలో అధిష్ఠానంతో సంప్రదింపులు, భారీ కసరత్తుతో ఐదు రోజుల తర్వాత ఆయన తన జట్టును ఖరారు చేశారు. కళంకితులను దూరంగా ఉంచాలన్న సూచన ఫలితంగా పదవి దక్కనివారు బాహాటంగానే అసంతృప్తి వెళ్లగక్కారు. దీంతో రాష్ట్రంలో చాలాచోట్ల నిరసన జ్వాలలు భగ్గుమన్నాయి. ముఖ్యంగా బళ్లారి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన గనుల కుబేరుడు, ఎంపి అనిల్ లాడ్ తీవ్ర ఆశాభంగానికి గురయ్యారు.
అనిల్ ఒక దశలో శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని హెచ్చరించగా, రాజ్యసభ స్థానానికీ రాజీనామా చేయాలని ఆయన అభిమానులు కోరారు. అయితే, ఆయన సోదరుడు సంతోష్ లాడ్కు మంత్రిపదవి దక్కడం గమనార్హం. స్పీకర్గా కగోడు తిమ్మప్పను ఎన్నుకోనున్నట్లు సిఎం వెల్లడించారు. అసంతృప్తి గురించి ప్రస్తావించగా విధాన పరిషత్ నుంచి ఒకరికి చోటు కల్పిస్తామని ముక్తసరిగా జవాబిచ్చారు.
మద్దతుదారుల నిరసన వెల్లువ
మంత్రివర్గ ఏర్పాటు కత్తిమీద సామేనన్న విశ్లేషకుల అంచనా నిజమైంది. ఇటు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం సాగుతుండగానే అటు నిరసన జ్వాలలు రేగాయి. ప్రధానంగా డాక్టర్ మల్కా రెడ్డి, శివకుమార్, మంజు, తన్వీర్ సేఠ్, శివశంకర్ రెడ్డిల అభిమానులు ఆగ్రహంతో రగిలిపోయారు. నరసింహరాజ నియోజకవర్గంలో తన్వీర్ సేఠ్ వీరాభిమాని ఫిరోజ్ ఖాన్ కిరోసిన్తో కోర్టు ప్రాంగణంలోనే వీరంగం వేశాడు. స్థానికులు అతడిని అడ్డుకోగా, పోలీసులు రంగంలో దిగి అదుపులోకి తీసుకున్నారు.
మల్కా రెడ్డి అభిమానులు, కార్యకర్తలు యాదగిరి జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పంటించారు. జిల్లా, తాలూకా పంచాయతీల సభ్యులంతా మూకుమ్మడి రాజీనామా చేస్తామంటూ హెచ్చరించారు. బెంగళూరులో శివ కుమార్ అభిమానులు టైర్లు దహనంచేశారు. మరికొందరు కేంద్ర మాజీ మంత్రి ఎస్.ఎం.కృష్ణ నివాసం ఎదుట దర్నాకు దిగారు. ఆయన భార్య ప్రేమ కృష్ణ... హైకమాండ్తో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
అధిష్టానం సూచన మేరకే కూర్పు: సిద్ధరామయ్య
అధిష్ఠానం సూచన మేరకే మంత్రివర్గ కూర్పు జరిగిందని సీనియర్లకు అవకాశం లభించకపోవడం వెనుక తన ప్రమేయం ఏమీ లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ అనంతరం ఆయన కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. కళంకితులు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని దూరంగా ఉంచాల్సిందిగా అధిష్ఠానం తనకు స్పష్టమైన సంకేతమిచ్చిందన్నారు. ఈ కారణంగానే కొందరు సీనియర్లను క్యాబినెట్లోకి తీసుకోలేకపోయినట్లు చెప్పారు.