హోంశాఖకు డిమాండ్: వీరి 'చిరు' ప్రయత్నాలు(పిక్చర్స్)
హైదరాబాద్: తాను గత నెల 8ని మంత్రి పదవికి రాజీనామా చేశానని సబితా ఇంద్రా రెడ్డి చెప్పడంతో ఇప్పుడు ఆమె నిర్వర్తించిన హోంమంత్రిత్వ శాఖపై పలువురి కన్ను పడింది. హోంమంత్రిత్వ శాఖను తమ వశం చేసుకునేందుకు పలువురు సీనియర్ నేతలు ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం.
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పంచాయతీరాజ్ శాఖమంత్రి జానా రెడ్డి, నల్గొండ జిల్లాకు చెందిన మరో సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు హోంమంత్రిత్వ శాఖను దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే, ఇన్నాళ్లు ఓ మహిళ అయిన సబితా ఇంద్రా రెడ్డి ఈ శాఖను నిర్వహించడంతో మహిళకే ఈ శాఖను అప్పగించాలనేది కొందరి వాదనగా ఉందట.
అలాగే తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళకే సబిత స్థానంలో హోంమంత్రిత్వ శాఖను అప్పగించాలని పలువురు కోరుతున్నారట. దీంతో తెలంగాణలో సీనియర్ మహిళా మంత్రులు అయిన డికె అరుణ, సునితా లక్ష్మా రెడ్డిల పేర్లు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి. అయితే వీటిని పక్కన పెట్టి దామోదర, జానా, ఉత్తమ్ తదితరులు ఢిల్లీ స్థాయి వరకు ప్రయత్నాలు ప్రారంభించారట.
ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఎప్పటి నుండో హోంమంత్రిత్వ శాఖపై పట్టుబడుతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వారి వద్దే హోంమంత్రిత్వ శాఖ ఉంటుందనేది ఆయన వాదన. ఈ విషయాన్ని ఆయన పలుమార్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లారు. హోం శాఖను తనకు ఇవ్వాలని ఆయన పలుమార్లు అడిగారట. అయితే, వర్గ విభేదాల నేపథ్యంలో కిరణ్ ససేమీరా అన్నారు. ఇప్పుడు సబితా ఇంద్రా రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ముఖ్యమంత్రికే అది ఉండాలనే వాదన తీసుకు వచ్చి దామోదర దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి చాలా సీనియర్ నేత. ముఖ్యమంత్రి పదవి మినహా అన్ని శాఖలను నిర్వర్తించిన నేత. ఆయన ఎప్పటి నుండో ముఖ్యమంత్రి పదవి కోసం అర్రులు చాస్తున్నారు. ఇప్పుడు సబిత రాజీనామా చేయడంతో హోంశాఖ కోసం ఆయన తన ప్రయత్నాలు ప్రారంభించారట.
నల్గొండ జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా హోం శాఖ కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారట. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవికి ఈయన సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో ఆయన ద్వారా ఢిల్లీ స్థాయిలో పావులు కదుపుతున్నారని అంటున్నారు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళ అయిన సబితా ఇంద్రా రెడ్డి స్థానంలో అదే ప్రాంతానికి చెందిన మహిళనే హోంమంత్రిగా నియమించాలనే వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. దీంతో మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన డికె అరుణ, మెదక్ జిల్లాకు చెందిన సునితా లక్ష్మారెడ్డిల పేర్లు వినిపిస్తున్నాయి.