స్పాట్ ఫిక్సింగ్లో పాక్ అంపైర్: ఓ జట్టు పాత్రపై ఆరా
త్వరలో ఇంగ్లాండు, వేల్స్ల్లో జరిగే చాంఫియన్స్ ట్రోఫీ నుంచి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) రవూఫ్ను తప్పించింది. బుక్కీలతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై విచారించేందుకు ముంబై పోలీసులు రవూఫ్కు సమన్లు జారీ చేసే అవకాశం ఉంది. రవూఫ్ వ్యవహారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి)ని చిక్కుల్లోకి నెట్టింది.
సమస్యంతా ఐపియల్ యాజమాన్యానిదని, అది పటిష్టమైన చర్యలు తీసుకుని ఉండాల్సిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ జకా అష్రాఫ్ అన్నారు. ఆరోపణలు రుజువు కాకముందే రవూఫ్ను చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పించడాన్ని ఆయన తప్పు పట్టారు.
రవూఫ్ను గతంలో కూడా వివాదాలు చుట్టుముట్టాయి. లీనా కపూర్ అనే మోడల్ రవూఫ్పై ఆరోపణలు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దోపిడీకి పాల్పడ్డాడని ఆమె రవూఫ్పై ఆరోపణలు చేసింది.
కాగా, మరో ముగ్గురు ఆటగాళ్లపై దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై పోలీసులు చెప్పారు. ఓ జట్టు పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. బెట్టింగ్కు సంబంధించిన సొమ్మును స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు హైదరాబాద్, గోవాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. స్పాట్ ఫిక్సింగ్ అత్యంత సిగ్గు చేటయిన విషయమని కేంద్ర క్రీడల మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. క్రీడాభిమానిగా, దేశ క్రీడల మంత్రిగా తాను తలదించుకుంటున్నానని ఆయన అన్నారు.
గురునాథ్కు శుక్లా బాసట
ఇదిలావుంటే, బిసిసిఐ చిఫ్ శ్రీనివాసన్ అల్లుడు గురునాథ్కు ఐపియల్ చైర్మన్ రాజీవ్ శుక్లా అండగా నిలిచారు. పోలీసులు దర్యాప్తు పూర్తి చేసేంత వరకు గురునాథ్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ఉన్నాడనే నిర్ణయానికి రావద్దని ఆయన సలహా ఇచ్చారు.
నైతికి బాధ్యత వహించి బిసిసిఐ చీఫ్ శ్రీనివాసన్ దిగిపోతారా అని అడిగితే దర్యాప్తు పూర్తి కాకుండా ఎవరినైనా ఎలా దోషిగా నిలబెడతారని ఆయన అడిగారు. పోలీసులు నివేదిక సమర్పించిన తర్వాత ఏం చేయాలనేది చూస్తామని ఆయన అన్నారు.