నన్ను కాల్చండి: నక్సల్స్కి రొమ్ము చూపిన మహేంద్ర!
నక్సల్స్ మెరుపు దాడి చేసిన డ్రైవర్ను కాల్చి వేయడంతో కాన్వాయ్ ఆగిపోయిందట. నక్సల్స్ దాడిని గమనించిన మహేంద్ర కర్మ కారులో నుండి కిందకు దిగి వారితో.. మీరు కార్యకర్తలను, ఇతరులను కాల్చవద్దని, తనను కాల్చండని చెప్పాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీంతో నక్సల్స్ అతడి చేతులు కట్టివేసి పక్కకు తీసుకు వెళ్లి కాల్చేశారు. పరుగుపెడుతున్న పిసిసి అధ్యక్షుడు నందకుమార్ను, ఆయన తనయుడును పట్టుకొని తీసుకెళ్లి చంపారు.
చీకటి రోజు: ప్రధాని
ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీలు ఆదివారం రాయపూర్లోని రామకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... ఇది చీకటి రోజు అని, హింసకు వ్యతిరేకంగా యావత్ దేశం ఒక్కటి కావాలని పిలుపునిచ్చారు. ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడ్డ కుటుంబాలకు రూ.50వేలు ప్రకటించారు. కాగా ఈ రోజు రాత్రి ఏడున్నర గంటలకు హైదరాబాదులోని గాంధీ భవన్లో ఛత్తీస్గఢ్ మృతుల సంతాపసభ జరుగనుంది.
ఖండించిన రాష్ట్రపతి
మావోయిస్టుల దుశ్చర్యలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆదివారం ఖండించారు. బాధితులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదన్నారు. దుశ్చర్యను ఖండిస్తున్నానని, నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు.
గతంలో తప్పించుకున్న మహేంద్ర
మహేంద్ర కర్మ 2000-2003 వరకు అజిత్ జోగి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం బిజెపి ప్రభుత్వం వచ్చింది. ఆ సమయంలో 2008లో అసెంబ్లీలో కాంగ్రెసు శాసనసభా పక్ష నేతగా ఉన్నారు. సల్వాజుడుంను స్థాపించారు. నక్సల్స్కు వ్యతిరేకంగా దీనిని స్థాపించారు. దీంతో అగ్రహం చెందిన నక్సల్స్ అతనిని హత్య చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు.
2012లో దంతెవాడలో మందుపాతర పేల్చి హత్య చేసేందుకు ప్రయత్నించినా విఫలమైంది. ఈ ఘటనలో తన డ్రైవర్, ఇద్దరు భద్రతా సిబ్బంది గాయాలపైనప్పటికీ మహేంద్ర కర్మకు ఏమీ కాలేదు. మావోయిస్టులపై పోరుకు గిరిజనులతో మహేంద్ర సల్వాజుడుంను ఏర్పాటు చేసి ముందుండి నడిపించారు. అయితే సల్వాజుడుం అక్రమమని సుప్రీం కోర్టు 2011 జూన్లో ప్రకటించి, దానిని రద్దు చేయాలని ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మహేంద్ర కర్మను బస్తర్ టైగర్ చెబుతారు.
కాగా తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం సమీపంలోని ఏవోబీలో పోలీసులు కూంబింగ్ జరుపుతున్నారు. ఛత్తీస్గఢ్ ఘటనలో ఆంధ్రా పోలీసుల హస్తం ఉందని వార్తలు వచ్చిన నేపథ్యంలో కూంబింగ్ జరుపుతున్నారు. ప్రజాప్రతినిధులు మారుమూర ప్రాంతాలకు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.