ఛత్తీస్గడ్ ఊచకోత వెనక కటికం సుదర్శన్, వేణు?
గత కొద్ది నెలలుగా మావోయిస్టులకు చత్తీస్గడ్లో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. దీంతో ప్రతీకారం తీసుకునేందుకు మావోయిస్టు పార్టీ కటికం సుదర్శన్ను నియమించినట్లు వార్తలు వచ్చాయి. చత్తీస్గడ్ ఊచకోత సూత్రధారి ఆంధ్రప్రదేశ్కు చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కటికం సుదర్శన్ అని కేంద్ర హోం మంత్రిత్వ వర్గాలు భావిస్తున్నాయి.
కాగా, ఆంధ్రప్రదేశ్లో కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు ఈ ఆపరేషన్లో ప్రధాన భూమిక పోషించినట్లు అనుమానిస్తున్నారు. మహేంద్ర కర్మను మట్టుబెట్టేందుకు సుకుమా జిల్లాలో అర డజను మావోయిస్టు మిలటరీ వింగ్ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కంపెనీలు మోహరించినట్లు చెబుతున్నారు. మెరుపుదాడికి 48 గంటలలోపే పూర్తిగా ప్రణాళిక రచించుకున్నట్లు అనుమానిస్తున్నారు.
ప్రణాళిక రూపకల్పనలో తిప్పర్తి తిరుపతి అలియాస్ దేవ్జీ అలియాస్ చేతను, మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను కూడా పాలు పంచుకున్నట్లు సమాచారం. వీరిద్దరు కూడా కరీంనగర్ జిల్లాకు చెందినవారే. మల్లోజుల వేణుగోపాల్ రావు ప్రభుత్వ బలగాల చేతిలో హతమైన మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్జీ సోదరుడు. వీరిద్దరు కూడా దాడిలో స్వయంగా పాల్గొన్నట్లు చెబుతున్నారు.