విశాఖ రచ్చ: దగ్గుపాటిని టిడిపి ఛీ కొట్టిందన్న టిఎస్సార్
దశాబ్దాలుగా విశాఖ ప్రజలకు సేవ చేస్తున్నానని కాబట్టే తాను ఆ సీటును కోరుతున్నానని చెప్పారు. సీటును కోరుకోవడంలో తప్పేంటన్నారు. తాను ఎప్పుడు కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి, వెంకటేశ్వర రావును విమర్శించలేదన్నారు. విశాఖతో ఉన్న అనుబంధం వల్లే తాను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిసి విశాఖ టిక్కెట్ను కోరానని చెప్పారు. పలుమార్లు తాను దగ్గుపాటికి సహకారం చేశానన్నారు.
దగ్గుపాటి ఓ జంపింగ్ నేత అన్నారు. దగ్గుపాటి పనికిరాడని టిడిపి భావిస్తే ఆయన బిజెపిలోకి వెళ్లిపోయారని, అక్కడ వాళ్లు తట్టుకోలేకపోవడంతో కాంగ్రెసు పార్టీలోకి వచ్చారన్నారు. నాగార్జున సాగర్ డ్యాం వ్యవహారంలో తనపై ఆరోపణలు చేస్తున్న ఆయనకు ఏం తెలుసునని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాగార్జున సాగర్ సిమెంటు కేసుపై దగ్గుపాటి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఆ కేసుతో తనకు సంబంధం లేదని కోర్టు కూడా తీర్పు ఇచ్చిందన్నారు.
విశాఖలో ఎవరి బలం ఉంటే వారే పోటీ చేస్తారన్నారు. ఎదుటి వారిని గౌరవించడం తన సిద్ధాంతమన్నారు. విమర్శించక పోవడం రెండో సిద్ధాంతమన్నారు. దగ్గుపాటి తనను విమర్శించేందుకు ఓ పిచ్చివాడిలో వ్యవహరించారన్నారు. అసలు విశాఖ విషయంలో వెంకటేశ్వర రావుకు ఏం సంబంధమన్నారు. విశాఖ ఎంపి పురంధేశ్వరి అయితే ఆయన ఎందుకు మాట్లాడుతున్నారన్నారు. ఆయన పిచ్చిమాటలు మాట్లాడారన్నారు.
తాను దశాబ్దాలుగా అన్ని రంగాలలో ఎదిగానని అన్నారు. దగ్గుపాటికి విశాఖ దిక్కులు తెలుసా అని ప్రశ్నించారు. తాను ఆయనలాంటి భాషను మాట్లాడలేనన్నారు. దగ్గుపాటి పైన రూ.5 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని అన్నారు. దగ్గుపాటి వ్యాఖ్యలు తాను ఖండించకపోతే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్నారు. తాను ఆజాద్తో మాట్లాడి దగ్గుపాటి దంపతులను కాంగ్రెసులోకి తీసుకున్నామని, గాదెను ఒప్పించి పర్చూరులో వెంకటేశ్వర రావును పోటీ చేయించానన్నారు.
తాను సినిమా తారలను తీసుకు వచ్చి సత్కరిస్తే పనికి రాని వాళ్లనడం శోచనీయమన్నారు. శివాజీ గణేశన్, బ్రహ్మానందం, మోహన్ బాబు, నాగార్జున, తెలుగు వారు గర్వించే గాయకులు పి.సుశీల్, ఎస్.జానకిలాంటి వారి పనికి రానివారా? అని ప్రశ్నించారు. దగ్గుపాటికి దమ్ముంటే సేవ చేయాలని, రాజకీయాలు శాశ్వతం కాదన్నారు.