మంత్రి వర్గం నుంచి డిల్ రవీంద్రారెడ్డి బర్తరఫ్: మనస్తాపం

ప్రభుత్వ పథకాలను విమర్శిస్తూ డిఎల్ రవీంద్రా రెడ్డి పలుమార్లు బహిరంగ విమర్శలు చేశారు. ఢిల్లీ పర్యటనకు వెళ్లి వచ్చిన మరునాడే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డీఎల్ పై వేటు వేయడం గమనార్హం. డీఎల్ ను తప్పించేందుకు ముఖ్యమంత్రికి అధినేత్రి సోనియాగాంధీ అనుమతి ఇచ్చారని సమాచారం. ముఖ్యమంత్రిపై విమర్శలు చేసిన పి. శంకరరావును కూడా గతంలో మంత్రివర్గం నుంచి తొలగించారు.
మంత్రివర్గం నుంచి తనను బర్తరఫ్ చేయడంపై డిఎల్ రవీంద్రా రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. గతంలోనే తాను రాజీనామా చేశానని, రాజీనామాను ఆమోదించి ఉండాల్సిందని ఆయన అన్నారు. రవీంద్రారెడ్డి బర్తరఫ్ ఉదంతం కాంగ్రెసులో తీవ్ర సంచలనానికి దారి తీసింది. డిఎల్ బర్తరఫ్ వంటి పరిణామాలు దురదృష్టకరమని పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారయణ అన్నారు. ఇదిలావుంటే, త్వరలో మరో ఇద్దరు మంత్రులపై వేటు పడే అవకాశాలున్నట్లు ప్రచారం సాగుతోంది.
మంత్రివర్గం నుంచి డిఎల్ రవీంద్రారెడ్డిని బర్తరఫ్ చేయడంపై ఆయన మద్దతుదారులు కడప జిల్లా కాజీపేటలో ఆందోళనకు దిగారు. ప్రసాద్ అనే యువకుడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మైదుకూరులో డిఎల్ అనుచరులు ధర్నాకు దిగారు. అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులు పోలీసు జీపు అద్దాలను పగులగొట్టారు.












Click it and Unblock the Notifications