మైసురా ఖాళీ భర్తీ: తెలుగుదేశంలోకి డిఎల్ జంప్?
తాను కాంగ్రెసులోనే ఉంటానని ఇంతకు ముందు చెప్పిన డిఎల్ రవీంద్రా రెడ్డి బుధవారం మాట మార్చారు. కాంగ్రెసులో ఉండాలా, వద్దా అనే విషయంపై శానససభా సమావేశాలు ముగిసిన తర్వాత తాను నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. అంటే, ఆయన పార్టీ మారే ఆలోచన చేస్తున్నారనేది స్పష్ఠమవుతూనే ఉందని అంటున్నారు. తెలుగదేశం పార్టీ నాయకత్వంతో డిఎల్ రవీంద్రా రెడ్డి చర్చలు కూడా పూర్తయినట్లు ప్రచారం సాగుతోంది.
మంగళవారం కూడా తాను పార్టీ మారే విషయంపై సంకేతాలు ఇచ్చారు. తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ గురించి బుథవారం తన నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ఆయన చెప్పారు. డిఎల్ రవీంద్రా రెడ్డి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడితో చర్చలు జరిపినట్లు కూడా చెబుతున్నారు. డిఎల్ తెలుగుదేశం పార్టీలో చేరుతారనే ప్రచారం కడప జిల్లాలో ముమ్మరంగానే సాగుతోంది.
అయితే ఆ ప్రచారాన్ని డిఎల్ ఖండించలేదు, అలాగని ఆమోదించనూ లేదు. కాంగ్రెసులో ఉంటానని మాత్రం చెప్పారు. ఈ నెలాఖరులోగా డిఎల్ రవీంద్రా రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరవచ్చునని అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మీతో మాట్లాడి భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయించుకుంటానని డిఎల్ రవీంద్రా రెడ్డి బుధవారం కడప జిల్లాలోని తన నియోజకవర్గం మైదుకూరు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పారు.
తనను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవమానించారని ఆయన భావిస్తున్నారు. ఇష్టం లేకపోతే రాజీనామా చేయాలని అడిగితే సరిపోయేదని, అలా కాకుండా తాను విదేశాల్లో ఉన్న సమయంలో తనను బర్తరఫ్ చేశారని, ఇది తనను అవమానించడమేనని ఆయన అంటున్నారు. తాను ఏ తప్పూ చేయనప్పుడు ఎలా బర్తరఫ్ చేస్తారని కూడా ఆయన అడిగారు. అడిగితే ఎడమ చేత్తో రాజీనామా రాసిచ్చేవాడినని ఆయన అన్నారు. ఈ స్థితిలో కాంగ్రెసులో కొనసాగడం సాధ్యం కాదనే భావనతో ఆయన ఉన్నట్లు చెబుతున్నారు.