భర్తపై వార్తలకు మీడియాపై నటి శిల్పా శెట్టి రుసరుసలు
తమ భర్త ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా రాశారని ఆమె మండిపడ్డారు. తాను తీవ్ర అసంతృప్తికి గురయ్యానని, రుజువులు లేకుండా నిందలు మోపుతున్నారని, ఇది అవాంఛనీయమని, సహించరానిదని ఆమె అన్నారు. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో అన్ని విషయాలు బయటకు వచ్చే వరకు వేచి చూడాలని, దర్యాప్తునకు తమ సహకారం ఉంటుందని ఆమె అన్నారు.
ఐపియల్ మ్యాచుల సందర్భంగా కుంద్రా బెట్టింగ్కు పాల్పడినట్లు, దానిపై కేసు నమోదు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మిత్రుడు ఉమేష్ గోయంకా పోలీసులకు ఇచ్చిన సమాచారంతో కుంద్రా చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. వ్యూహం, జట్టు కూర్పు, పిచ్ స్థితి, గెలిచే అవకాశాలు ఉన్న జట్టు వంటి వివరాలను అతను రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లను అడిగేవాడని తెలుస్తోంది.
గోయంకా వాంగ్మూలాన్ని పోలీసులు మెజిస్ట్రేట్ ముందు రికార్డు చేసినట్లు సమాచారం. దీంతో దాని నుంచి గోయంకా వెనక్కి తగ్గడానికి వీలుండదు. ఇతరుల పాత్ర గురించి మాత్రమే కాకుండా అరెస్టయిన ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చవాన్, అజిత్ చండిల గురించి మరింత సమాచారాన్ని అందించినట్లు చెబుతున్నారు. గోయంకాకు చెందిన అహ్మదాబాద్లోని అశ్వినీ స్టీల్ ప్రైవెట్ లిమిటెడ్లో గోయంకా భాగస్వామి.
కుంద్రాకు బెట్టింగుతోనే సంబంధం ఉండి ఉంటుందని, ఫిక్సింగ్తో సంబంధం లేదని పోలీసులు అంటున్నారు. బెట్టింగ్ వ్యవహారంపై కుంద్రాను పోలీసులు అరెస్టు చేయవచ్చునంటూ కూడా వార్తలు వచ్చాయి. కుంద్రాను, ఆయన వ్యాపార భాగస్వామిని గోయంకాను మరోసారి పోలీసులు విచారించే అవకాశాలున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
రాజస్థాన్ రాయల్స్ అటగాడు సిద్ధార్థ్ త్రివేది గోయంకా గురించి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో కుంద్రాను విచారణ నిమిత్తం పోలీసులు పిలిచినట్లు చెబుతున్నారు. గోయంకా ఏ హోదాలో ఆటగాళ్లతో ముచ్చటించాడనే అంశంపై పోలీసులు కుంద్రాను ప్రశ్నించినట్లు సమాచారం. తన జట్టు ఆటగాళ్లను ఓపెన్ పార్టీలకు అనుమతించడంపై కూడా అడిగినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో శిల్పా శెట్టిని కూడా పోలీసులు విచారించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.