మహారాష్ట్రకు సిబిఐ జెడి లక్ష్మినారాయణ బదిలీ
ఈ నెల 11వ తేదీ మంగళవారంనాడు సిబిఐ హైదరాబాద్ విభాగం జెడిగా పదవీబాధ్యతల నుంచి తప్పుకుంటారు. లక్ష్మినారాయణను బదిలీ చేస్తూ ఢిల్లీలోని సిబిఐ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. చెన్నై సిబిఐ జాయింట్ డైరెక్టర్ అరుణాచలానికి బాధ్యతలు అప్పగించాలని లక్ష్మినారాయణకు ఆదేశాలు అందాయి.
లక్ష్మీనారాయణ 2006లో హైదారాబాద్ సిబిఐకి వచ్చారు. రెండు సార్లు ఆయన పదవీకాలాన్ని పొడగించారు. డిప్యుటేషన్ కాల పరిమితి ఏడేళ్లు పూర్తి కావడంతో లక్ష్మినారాయణను సొంత క్యాడర్కు పంపుతూ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కేసు దర్యాప్తుతో ఆయన పేరు వ్యాప్తిలోకి వచ్చింది. అత్యంత ముఖ్యమైన కేసుల దర్యాప్తును ఆయన చేపట్టారు. ఓబుళాపురం మైనింగ్ కేసుతో పాటు ఎమ్మార్ ప్రాపర్టీస్, వైయస్ జగన్ ఆస్తుల కేసుల దర్యాప్తు ఆయన నేతృత్వంలో జరిగింది. సత్యం కుంభకోణం కేసు దర్యాప్తునకు కూడా ఆయనే నేతృత్వం వహించారు.
వైయస్ జగన్ ఆస్తుల కేసు విచారణలో ఆయన విమర్శలను కూడా ఎదుర్కున్నారు. ఒక వర్గం మీడియాకు ఆయన లీకులు ఇస్తున్నారంటూ ఆయనపై విమర్శలు వచ్చాయి. వైయస్ జగన్ ఆస్తుల కేసులో ఇప్పటి వరకు ఐదు చార్జిషీట్లను కోర్టుకు సమర్పించారు. మరో ఆరు అంశాలపై చార్జిషీట్లు దాఖలు చేయాల్సి ఉంది.
వైయస్ జగన్ ఆస్తుల కేసు దర్యాప్తు కూడా పూర్తయిందని, చార్జిషీట్లు కూడా రూపొందించారని, వాటిని కోర్టుకు సమర్పించడమే ఉందని అంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కేసు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణం కేసు దర్యాప్తులు ఇప్పటికే ముగిశాయి.
జెడి బదిలీని ఆపాలని పిటిషన్
సిబిఐ జెడి లక్ష్మినారాయణ బదిలీని ఆపాలని కోరుతూ కుటుంబ రావు అనే సామాజికవేత్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వైయస్ జగన్ ఆస్తుల కేసు దర్యాప్తు పూర్తయ్యే వరకు సిబిఐ హైదరాబాద్ జెడిగా లక్ష్మినారాయణను కొనసాగించాలని ఆయన కోర్టును కోరారు.