జగన్ మద్యం తాగరు, చూడాలని వస్తే ఓవర్: అంబటి
జైలులో ఉన్న పార్టీ అధ్యక్షుడిగా రాజకీయాలు చేసే అధికారం వైయస్ జగన్కు ఉందని ఆయన అన్నారు. వైయస్ జగన్ను చూసేందుకు వచ్చిన ప్రజలను నిర్బంధించాల్సిన అవసరం ఏమిటని ఆయన అడిగారు. సిబిఐ కన్నా పోలీసుల ఓవరాక్షన్ ఎక్కువైందని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రజస్వామ్య దేశంలో ఉన్నామా, రాష్ట్రంలో సైనిక పాలన నడుస్తోందా లేదంటే రాచరిక పాలన నడుస్తోందా అని అంబటి రాంబాబు అడిగారు. 15వ లోకసభలో అత్యధిక మెజారిటీతో గెలిచిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ఆన అన్నారు. అలాంటి వ్యక్తిని చూసేందుకు ప్రజలు వస్తే కర్ఫ్యూ లాంటి వాతావరణం సృష్టించడం సమంజసమేనా అని ఆయన అడిగారు.
పోలీసుల నిర్వాకం వెనక అదృశ్య ఆదేశాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. తమ పార్టీ నాయకురాలు కొండా సురేఖ సవాల్పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించలేదని ఆయన అడిగారు. చంద్రబాబు కేవలం కుప్పంకే పరిమితమయ్యే రోజు త్వరలోనే ఉందని వ్యాఖ్యానించారు.
జగన్ ములాఖత్లపై తెలుగుదేశం పార్టీ అసత్య ప్రచారం సాగిస్తోందని అంబటి రాంబాబు అన్నారు. ఆ పార్టీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని విరుచుకుపడ్డారు. జగన్ జైలులోనే కాదు, బయట కూడా మద్యం సేవించరని ఆయన అన్నారు. అందుకు వైద్య పరీక్షలకైనా సిద్ధమేనని అన్నవారు ఎందుకు ముందుకు రావడం లేదని అడిగారు. తెలుగుదేశం పార్టీ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని అంబటి దుయ్యబట్టారు. జగన్కు ఉన్న ప్రజాదరణను చూసి టిడిపి భయపడుతోందని ఆయన అన్నారు.