విశ్రాంతికి టైమ్ ఇదే: వాజ్పేయి, అద్వానీ సహా..
పానాజీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ముందుకు అడుగు వేయడానికి భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రయత్నాలు సాగిస్తోంది. ఇందుకు బిజెపి ప్రధానమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. రెండు రోజుల పార్టీ కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి నరేంద్ర మోడీ, సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ తదితర నాయకులు గోవా చేరుకున్నారు.
ఎల్కె అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి, జస్వంత్ సింగ్ వంటి పలువురు నాయకులు ఆరోగ్య కారణాలు చూపి సమావేశానికి హాజరు కావడం లేదు. అద్వానీ శనివారం సమావేశానికి వస్తారని బిజెపి నాయకులు చెబుతున్నారు. పలు విభేదాలు ఉన్నప్పటికీ యువతకు, అనుభవజ్ఞులకు మధ్య సమతుల్యత సాధించడానికి పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ స్థితిలో అద్వానీ, వాజ్పేయిలతో సహా కొంత మంది నాయకులు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదనే అభిప్రాయం వినిపిస్తోంది. ఎన్నికల పోరులో తలపడడానికి సీనియర్లు తప్పుకుని యువతకు అవకాశం ఇస్తే మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అనారోగ్యం వల్ల వాజ్పేయి ఇప్పటికే క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అయితే, ఆయన కోసం బిజెపి ఇప్పటికీ పార్లమెంటరీ బోర్డు సీటును పదిలంగా ఉంచింది. 85 ఏళ్లు నిండిన అద్వానీ బిజెపి ప్రధాని అభ్యర్థిగా ముందుకు రావడానకి ప్రయత్నాలు చేస్తున్నారు. సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నరేంద్ర మోడీ, రాజ్నాథ్ సింగ్ వంటి నాయకులకు అవకాశం కల్పిస్తూ 79 ఏళ్ల మురళీ మనోహర్ జోషీ పక్కకు జరిగే అవకాశం ఉంది.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమంయంలో బిజెపి సాహసోపేత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్నికలకు ముందే ప్రధాని అభ్యర్థి పేరును ప్రకటించాలని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా పలువురు నాయకులు అంగీకరిస్తున్నారు. అద్వానీ అనుకూల నాయకులు మాత్రం వ్యతిరేకంగా ఉన్నారు.
గోవా సమావేశంలో పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ పార్టీ కార్యకర్తలకు స్పష్టమైన సందేశాన్ని ఇస్తారని భావిస్తున్నట్లు బిజెపి నాయకుడు రాజీవ్ ప్రతాప్ రూడీ అన్నారు. సమావేశానికి ముందే రాజ్నాథ్ సింగ్ పార్టీ సీనియర్ నేతలతో, పార్లమెంటరీ బోర్డు సభ్యులతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే - బిజెపి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అర్థమవుతోంది. మోడీ, సుష్మా, జైట్లీ వంటి నాయకులతో ముందుకు సాగుతుందని భావించడానికి వీలవుతోంది. మూడు సార్లు గుజరాత్ ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా మోడీ తన ప్రజాదరణను రుజువు చేసుకున్నారు. క్లిష్ట సమయాల్లో సుష్మా స్వరాజ్, జైట్లీ పార్టీకి అండగా నిలిచారు.