జగన్దే హవా: శంకరన్న, కుమ్మక్కుపై డిఎల్ X రేవంత్

లాబీల్లో డిఎల్, రేవంత్ మధ్య ఆసక్తికర చర్చ
అసెంబ్లీ లాబీల్లో మాజీ మంత్రి, మైదుకూరు ఎమ్మెల్యే డిఎల్ రవీంద్రా రెడ్డి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిల మధ్య ఆసక్తికరమైన చర్చ సాగింది. గత అసెంబ్లీ సమావేశాలలో పెట్టిన అవిశ్వాస తీర్మానానికి తెలుగుదేశం పార్టీ మద్దతిస్తే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవి పోయేదని రేవంత్తో డిఎల్ అన్నారు. ముఖ్యమంత్రితో టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో కలిసిపోయారనే ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్లిందని ఆయన అన్నారు.
దానికి రేవంత్ రెడ్డి స్పందించారు. అవినీతి వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో కలిసి తాము అవిశ్వాస తీర్మానానికి కలిసి ఎలా మద్దతిస్తామని డిఎల్ను ప్రశ్నించారు. తాము అవిశ్వాసానికి మద్దతిచ్చినా మజ్లిస్ పార్టీ కాంగ్రెసు ప్రభుత్వాన్ని కాపాడే పరిస్థితి ఉందని రేవంత్ సమాధానమిచ్చారు.
బిఏసి సమావేశం
సభాపతి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన శాసనసభ వ్యవహారాల సలహా సంఘం జరిగింది. రెండో విడత బడ్జెట్ సమావేశాల పని దినాలు, అజెండాను ఖరారు చేస్తారు. ఈ సమావేశంలో చంద్రబాబు, కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, విజయమ్మ, గుండా మల్లేష్, జయప్రకాశ్ నారాయణ పాల్గొన్నారు. 21వ తేది వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. నిత్యావసర ధరలు, ఎరువుల కొరత తదితర అంశాలపై చర్చించాలని నిర్ణయించారు.
తెలంగాణపై తీర్మానం చేయాలని ఈటెల రాజేందర్ కోరగా... అది కేంద్రం పరిధిలో ఉందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. అందుకు మీరే ఒప్పించవచ్చుగా అని మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. మరో పదిరోజులు సమావేశాలు పొడిగించాలని ప్రతిపక్షాలు కోరగా పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కుదరదని ప్రభుత్వం చెప్పింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు 70 రోజులు పొడిగించాలని చెప్పారుగా అని చంద్రబాబు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications