అసెంబ్లీ: తెలంగాణ నేత దామోదర కార్లో సిఎం బయటకు
చలో అసెంబ్లీ నేపథ్యంలో ముఖ్యమంత్రి, సభాపతిలు ఉదయమే అసెంబ్లీకి వచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రి కాన్వాయ్ని తెలంగాణవాదులు అడ్డుకున్నారు. వెళ్లేటప్పుడు కూడా అడ్డుకుంటారని భావించి ఆయన తెలంగాణ ప్రాంతానికి చెందిన దామోదర కాన్వాయ్లో వెళ్లారు. అసెంబ్లీ గేట్ 1 వద్ద తెరాస, అసెంబ్లీ 2 గేట్ వద్ద సిపిఐ, బిజెపి ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. దీంతో కిరణ్, సభాపతిలు మరో గేటు ద్వారా బయటకు వెళ్లారు.
మరోవైపు రోడ్డుపై పడుకొని వాహనాలను అడ్డుకునే ప్రయత్నాలు చేసిన ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్టు చేశారు. బిజెపి ఎమ్మెల్యేలు యెండల లక్ష్మీ నారాయణ, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, నాగం జనార్ధన్ రెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు, తెరాస ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, కల్వకుంట్ల తారక రామారావు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, తెరాస నేత చంద్రశేఖర్ సహా పలువురిని లిబర్టీ వద్ద పోలీసులు అడ్డకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, తెలంగాణవాదులకు మధ్య తోపులాట జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటోందని సిపిఎం నేత జూలకంటి రంగారెడ్డి ఆరోపించారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత కాంగ్రెసు పార్టీదే అన్నారు.