సిఎం గూండాగిరి: సిపిఐ, విగ్రహాలు కూల్చాలా?: శేషారెడ్డి
నాలుగున్నర కోట్ల మంది ప్రజలు తెలంగాణ కోసం డిమాండ్ చేస్తుంటే అధికార పార్టీ దానిని పట్టించుకోకపోవడం దారుణమని బిజెపి నేత, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణపై యూపిఏ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం గూండాగిరితో చలో అసెంబ్లీని అడ్డుకోవాలని చూస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. ఎమర్జెన్సీ సమయంలో కూడా ఇలాంటి కట్టుదిట్టమైన భద్రత, అరెస్టులు, బైండోవర్లు లేవని ఆయన అబిప్రాయపడ్డారు. పార్టీ కార్యాలయాలకు వచ్చి అరెస్టులు చేయడం ఏ ప్రజాస్వామ్యమన్నారు. భద్రతా ఏర్పాట్లు చూస్తుంటే ఎమర్జెన్సీ కాలం గుర్తుకు వస్తోందని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు.
విగ్రహాలు కూల్చక్కరలేదు: శేషారెడ్డి
ప్రజాస్వామ్యంలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని కానీ, అందుకోసం అసెంబ్లీ ముట్టడించాల్సిన అవసరం లేదని, విగ్రహాలు కూల్చక్కరలేదని అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి శేషా రెడ్డి అన్నారు. మరోవైపు చలో అసెంబ్లీ కారణంగా ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు.
ఓయులో టెన్షన్
చలో అసెంబ్లీ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. ఎన్సీసి గేటు వద్దకు చేరుకున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థులు ముళ్లకంచెలు తొలగించి వెళ్లే ప్రయత్నాలు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. తాము ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీని ముట్టడిస్తామని విద్యార్థులు చెబుతున్నారు. ఇందిరాపార్కు వద్దకు ర్యాలీగా బయలుదేరిన ఆయా పార్టీల కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.