చమురు లాబీ బెదిరిస్తోంది: మొయిలీ సంచలన ప్రకటన
మనం దిగుమతులు నిలిపేయడం కొన్ని లాబీలకు ఇష్టం లేదని, ఈ శాఖను చూసే ప్రతి మంత్రి తరచూ బెదిరింపులను ఎదుర్కొంటాడని వీరప్ప మొయిలీ అన్నారు. అయితే మంత్రులను బెదిరించిన వారి పేర్లను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు. చమురు లాబీల బెదిరింపులకు భయపడబోనని, 2030కల్లా భారత్ ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా కృషి చేస్తానని స్పష్టం చేశారు.
దేశీయంగా చమురు ఉత్పత్తులు పెరగకపోతే చమురు దిగుమతులు మరింత పెరుగుతాయని, ఇది దేశానికి తీవ్రమైన నష్టం చేస్తుందని ఆయన అన్నారు. నాలుగైదేళ్లుగా పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకు రావడం లేదని, మనం వారికి తగిన ధరను కల్పించాల్సి ఉందని, లేకపోతే ఎవరూ రారని అన్నారు. అందుకే దేశీయ గ్యాస్ ధరలను(యూనిట్కు 4.2 నుంచి 6.77 డాలర్లకు) పెంచాలని ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్కు ప్రతిపాదించినట్లు మొయిలీ చెప్పారు.
రిలయన్స్కు లబ్ధి చేకూర్చేందుకే గ్యాస్ ధరలు పెంచాలని చూస్తున్నారన్న సిపిఐ నేత గురుదాస్ దాస్గుప్తా ఆరోపణలపై స్పందిస్తూ - చమురు రంగంలో దేశం ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం కనుగొనడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దీనిపై ఎవరైనా చర్చకు రావచ్చని, తమకు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని చెప్పారు.
వీరప్పమొయిలీ వ్యాఖ్యలను బిజెపి, వామపక్షాలు తప్పు పట్టాయి. గ్యాస్ ధరలను పెంచి ప్రైవేట్ కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే మంత్రి కట్టు కథలు అల్లుతున్నారని మండిపడ్డాయి. మొయిలీ అబద్ధాలకోరు అని, ఆ శాఖ మాజీ మంత్రుల నుంచే వ్యతిరేక త వస్తుండటంతో మొయిలీ కట్టుకథ అల్లుతున్నారని గురుదాస్ దాస్గుప్తా వ్యాఖ్యానించారు. జైపాల్ రెడ్డిని చమురు శాఖ నుంచి తప్పించడంపై అన్ని వర్గాల నుంచి ఆరోపణలు వచ్చాయని, ఆయన తొలగింపు వెనుక ఉన్న శక్తులెవరో తెలియాలని, మొయిలీ నిజాలు వెల్లడించాలని సిపిఐ నేత డి.రాజా డిమాండ్ చేశారు.
లాబీయిస్టుల పేర్లను మంత్రి బయటపెట్టి ఉండాల్సిందని, తాను ఐదేళ్లు ఆ శాఖ బాధ్యతలు చేపట్టినా ఎప్పుడూ ఎవరి నుంచి ఒత్తిళ్లను ఎదుర్కొనలేదని బిజెపి నేత రామ్ నాయక్ అన్నారు.