శారీరకంగా కలిస్తే వివాహమైనట్లే: మద్రాసు హైకోర్టు
21 ఏళ్లు నిండిన వ్యక్తితో 18 ఏళ్ల యువతి లైంగిక సంబంధం పెట్టుకోవడం ద్వారా గర్భవతి అయితే వారిద్దరి మధ్య వివాహం జరిగినట్లు పరిగణించాల్సిందేనని జస్టిస్ సిఎస్ కర్నన్ అన్నారు. భార్యకు ఉండే హక్కులన్నీ ఆ మహిళకు ఉంటాయని అన్నారు.
గర్భం దాల్చకున్నా లైంగిక సంబంధం ఉన్నట్లు బలమైన ఆధారాలుంటే కూడా ఇద్దరిని భార్యాభర్తలుగానే పరిగణించాల్సి ఉంటుందని అన్నారు. వారు విడిపోతే ఆమె నుంచి విడాకులు తీసుకోకుండా వివాహం చేసుకోవడానికి వీలు లేదని కోర్టు వ్యాఖ్యానించింది. సంప్రదాయం కన్నా చట్టం పైస్తాయిలో ఉండాలని అన్నది.
ఆ వ్యక్తి లైవ్ బర్త్ రిపోర్టుపై రెండో సంతానానికి సిజేరియన్ ఆపరేషన్ కోసం సంతకం చేశాడని, తద్వారా ఆమె తన భార్య అని అంగీకరించాడని కోర్టు అభిప్రాయపడింది. వివిధ పద్ధతుల్లో పెళ్లి చేసుకోవడం సంప్రదాయం మాత్రమేనని, అనివార్యం కాదని ఆయన అన్నారు. సాధారణ జీవితంలో వారిద్దరిని భార్యాభర్తలుగానే పరిగణిస్తున్నట్లు తేల్చి చెప్పింది.
ఇద్దరు ఒకే స్థావరంలో ఉండి వివాహ జీవితాన్ని గడిపారని, పిల్లలను కన్నారని, వారికి పుట్టినవారు చట్టబద్ధమైన పిల్లలేనని, భార్యగా ఆమె, భర్తగా అతను హోదా పొందారని అన్నది. పిటిషనర్ చట్టబద్దమైన భార్యేనని కోర్టు తెలిపింది. అందువల్ల 2000 సెప్టెంబర్ నుంచి ఆమెకు నెలకు 500 చొప్పున మనోవర్తి చెల్లించాలని కోర్టు అతన్ని ఆదేశించింది.