అద్వానీతో నరేంద్ర మోడీ భేటీ: ఎన్డిఎ చీలికపై చర్చ
న్యూఢిల్లీ: బిజెపి ప్రచార కమిటీ సారథి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం పార్టీ అగ్రనేత ఎల్కె అద్వానీని కలిశారు. ప్రచార కమిటీ చైర్మన్గా నియమితులైన తర్వాత మోడీ అద్వానీతో భేటీ కావడం ఇదే మొదటిసారి. ఇరువురి మధ్య భేటీ సామరస్యపూర్వకంగా సాగిందని, ఎన్డిఎ చీలిక గురించి చర్చించుకున్నారని అంటున్నారు.
ప్రతి ఒక్కరినీ తనతో పాటు తీసుకుని వెళ్తానని మోడీ అద్వానీకి హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇరువురు గంట సేపు సమావేశమయ్యారు. పార్టీ అంతర్గత విషయాలతో పాటు జెడి (యు) ఎన్డిఎ నుంచి తప్పుకోవడంపై వారిరువురి మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం.

మోడీకి ప్రమోషన్ ఇవ్వడంపై అలిగి అద్వానీ పార్టీ పదవులకు రాజీనామా చేశారు. సీనియర్ నేతలంతా సర్దిచెప్పడంతో ఆయన తన రాజీనామాలను వెనక్కి తీసుకున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా అద్వానీతో మాట్లాడి రాజీనామాలు వెనక్కి తీసుకునేలా చేశారు. సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీతో సమావేశమైన అనంతరం మోడీ అద్వానీ నివాసానికి వచ్చారు.
ఆ తర్వాత వాజ్పేయి నివాసంలో ఆయన గంటకు పైగా గడిపారు. బిజెపి సారథిగా నియమించడం పట్ల ధన్యవాదాలు తెలపడానికి మోడీ వచ్చారని మురళీ మనోహర్ జోషీ తనతో భేటీ తర్వాత చెప్పారు. బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని మోడీ చెప్పినట్లు ఆయన తెలిపారు.
రాష్ట్ర వార్షిక ప్రణాళికను ఖరారు చేయించుకోవడానికి మోడీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెంక్ సింగ్ అహ్లువాలియాతో సమావేశమయ్యారు. మోడీ బిజెపి అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ను కూడా కలిసినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications