అయోధ్యకు మోడీ: అద్వానీ వస్తే చూస్తామని జెడియు
మోడీ బుధవారం లేదా శుక్రవారం అయోధ్యకు వస్తారని తెలిపారు. మోడీ అయోధ్య నుంచి దేశ ప్రజలకు ఇవ్వబోయే సందేశానికి రాబోయే ఎన్నికల్లో చాలా ప్రాముఖ్యత ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కొన్నేళ్లుగా రామ మందిర అంశాన్ని పక్కకు పెట్టిన బిజెపి మళ్లీ దాన్ని తలకెత్తుకుంటోందన్న విషయాన్ని మోడీ రాక స్పష్టం చేస్తోందన్నారు.
అద్వానీ వస్తే..: శరద్ యాదవ్
బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి బిజెపి నాయకత్వ పగ్గాలు అప్పగిస్తే ఎన్డీయేలోకి తిరిగొచ్చే అవకాశాలు లేకపోలేదని జెడి(యు) అధ్యక్షుడు శరద్ యాదవ్ సోమవారం చెప్పారు. తమ వ్యతిరేకత కేవలం మోడీపై మాత్రమేనని చెప్పకనే చెప్పినట్లయింది.
ఎన్డీయేలో తిరిగి చేరే విషయమై స్పందిస్తూ... "అద్వానీ వస్తే ఆలోచిద్దాం'' అన్నారు. ఆయన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఇంట్లో పార్టీ సమావేశానికి వెళ్లేముందు ఈ వ్యాఖ్యలు చేశారు. 2009 ఎన్నికల్లో అద్వానీని ప్రధాన అభ్యర్థిగా ప్రతిపాదించి పోరాడామని గుర్తుచేశారు. అద్వానీకి పగ్గాలు అప్పగించే విషయమై బిజెపిని అడగాలని మీడియా ప్రతినిధులను కోరారు. ఆయనను పార్టీలో పక్కన పెట్టేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు నితీష్ మాట్లాడుతూ.. బిజెపిలో అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అద్వానీల శకం ముగిసిపోయిందన్నారు. కొత్త రక్తం పార్టీ విధానాల నుండి దారి మళ్లుతున్నట్లుగా కనిపిస్తోందన్నారు. కొత్త నాయకత్వంలో పని చేయడం అసాధ్యమన్నారు. అద్వానీని బిజెపి కించపర్చిందన్నారు.