కోడలి కేసులో శంకరన్న సరెండర్, కెసిఆర్పై కేసు వెనక్కి
శంకర రావు కోడలు వంశీప్రియ మంగళవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఓ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. తన భర్త శశాంక్, మామ శంకర రావు, అత్త విశ్వశాంతి, ఆడపడుచు సుష్మితను అరెస్టు చేయాలని ఆమె అందులో కోరారు. వారు తమను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.
పోలీసులచే విచారణ జరిపించాలని కోరారు. తనను వరకట్నం కోసం వేధిస్తున్నారని ఆమె అన్నారు. అంతకుముందు క్రిమినల్ కోర్టు వారిని కోర్టు ఎదుట లొంగిపోవాలని, పాస్పోర్టులు పోలీసులకు ఇవ్వాలని ఆదేశించిందని కానీ, వారు సరెండర్ కాలేదని, వారిపై పోలీసులు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు.
వంశీప్రియ చేసిన ఫిర్యాదు మేరకు... శంకర రావు కూతురు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాతనే తనకు వేధింపులు ప్రారంభమయ్యాయని ఆమె పేర్కొన్నారు. తనను వేధిస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆమె తన పిటిషన్లో పేర్కొన్నారు. ఆమె పిటిషన్ స్వీకరించిన కోర్టు వారికి నోటీసులు జారీ చేసింది.
శంకర రావు లొంగుబాటు
తన కోడలు వంశీప్రియను వేధించిన కేసులో మాజీ మంత్రి శంకర రావు సిసిఎస్ మహిళా పోలీసుల ఎదుట బుధవారం లొంగిపోయారు. శంకర రావుతో పాటు ఆయన భార్య విశ్వశాంతి కూడా లొంగిపోయారు. వారు ఇప్పటికే ముందస్తు బెయిల్ను పొందారు.
కెసిఆర్పై పిటిషన్ ఉపసంహరణ
మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మెదక్ పార్లమెంటు సభ్యురాలు విజయశాంతి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుల ఆస్తులపై విచారణ జరిపించాలన్న పిటిషన్ను దరఖాస్తుదారుడు బాలాజీ ఉపసంహరించుకున్నారు.
సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ బదలీపై...
సిబిఐ జెడిగా పని చేసి ఇటీవల బదలీ అయిన లక్ష్మీ నారాయణను కొనసాగించాలన్న పిటిషన్ను హైకోర్టు రెండు వారాల పాటు వాయిదా పడింది. ఈ పిటిషన్ పైన కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. అదే సమయంలో సిబిఐ కూడా లక్ష్మీ నారాయణ బదలిపై ప్రమాణ పత్రం దాఖలు చేసింది. దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్కు సూచించింది.