బాబును టార్గెట్ చేసిన జగన్ పార్టీ: కిరణ్ రెడ్డికీ లింక్
వైయస్ జగన్ పార్టీ శానససభ్యుల దాడితో తెలుగుదేశం పార్టీ ఆత్మరక్షణలో పడినట్లే కనిపించింది. సభా కార్యక్రమాలను అడ్డుకున్నందుకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను సభనుంచి ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు. బయటకు వచ్చిన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు చంద్రబాబుపై ఆరోపణలు సాగించారు. ఐఎంజి భూభాగోతంలో వేలాది కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆ పార్టీ శానససభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. రూ. 8500 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని నామమాత్రపు ధరకు చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో ఇతరులకు కట్టబెట్టారని ఆయన ఆరోపించారు.
ఐఎంజీ భూముల కుంభకోణంపై విచారణ జరిపించాలని చీఫ్ విప్ హోదాలో ఉన్నప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారని, ఇప్పుడు తన ప్రభుత్వాన్ని మోస్తున్నాడని చంద్రబాబును కిరణ్ కుమార్ రెడ్డి రక్షిస్తున్నారని ఆయన విమర్శించారు. ఐఎంజి భూబాగోతంపై సభలో చర్చకు పట్టుబడితే ప్రభుత్వం అనుమంతిచడం లేదని ఆయన తప్పు పట్టారు. చంద్రబాబుకు దమ్ముంటే ఐఎంజి భూభాగోతంపై సిబిఐ దర్యాప్తును కోరాలని ఆయన అననారు. తన తప్పు లేదని నిరూపించుకునే దమ్ము చంద్రబాబుకు ఉందా అని అడిగారు.
తెలుగుదేశం పార్టీ సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు తనపై చేసిన ఆరోపణలకు స్పందిస్తూ కాంగ్రెసు శాసనసభ్యుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా ఐఎంజీ భూముల విషయాన్ని శాసనసభలో ప్రస్తావిస్తూ చంద్రబాబును తప్పు పట్టారు. ఐఎంజి భూముల వ్యవహారంపై తాను సభలో లేవనెత్తిన విషయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించారు. ఆ వ్యవహారంపై ప్రభుత్వం అప్పట్లో సిబిఐ దర్యాప్తును కోరిందని, అయితే సిబ్బంది లేదని చెప్పి సిబిఐ దాన్ని చేపట్టలేదని ఆయన అన్నారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆరోపణలను ఖండించడానికి తెలుగుదేశం పార్టీ సభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు తీవ్రంగానే ప్రయత్నించారు. జగన్, కిరణ్ కుమార్ రెడ్డి అవినీతి కవలలని ఆయన ఆరోపించారు. జగన్ ప్రజల సొమ్ము కాజేస్తే ముఖ్యమంత్రి స్పందించడం లేదని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆరోపించారు. కిరణ్ కుమార్ రెడ్డితో సంబంధం వల్లనే జగన్కు చంచల్గుడా జైలులో రాచమర్యాదలు చేస్తున్నారని ఆయన అన్నారు. మొత్తం మీద, చంద్రబాబును టార్గెట్ చేసుకుని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కయి జగన్ను జైలులో పెట్టేలా చేశాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లడానికి నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.