అద్వానీతో నరేంద్ర మోడీ భేటీలో ఏం జరిగింది?
ఇరువురు నేతల మధ్య సామరస్యపూర్వక వాతావరణంలో మాటామంతీ సాగిందని పార్టీ వర్గాలు చెప్పాయి. మోడీ అద్వానీ ఆశీస్సులు కోరినట్లు సమాచారం. తాను సీనియర్ నేతలను సంప్రదించే ముందుకు సాగుతానని మోడీ అద్వానీతో చెప్పినట్లు సమాచారం. తాను రాజీనామా చేసిన కారణం వేరని, నీకు పదోన్నతి కల్పించడాన్ని నిరసిస్తూ రాజీనామా చేయలేదని అద్వానీ మోడీతో చెప్పినట్లు సమాచారం.
లోకసభకే కాకుండా కొన్ని రాష్ట్రాలకు కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పర్యవేక్షణకు రెండు విడివిడి జట్లను ఏర్పాటు చేయాలని అద్వానీ ఆర్ఎస్ఎస్కు సూచించినట్లు, ఈ సూచనను ఆర్ఎస్ఎస్ తిరస్కరించినట్లు చెబుతున్నారు. తన రాజీనామాకు అదే కారణమని అద్వానీ చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తం మీద, నరేంద్ర మోడీ అద్వానీని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించినట్లు చెబుతున్నారు.
అద్వానీ రాజీనామా మోడీ పదోన్నతిపై కాదు
అద్వానీ రాజీనామాకు మోడీని పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా నియమించడం కారణం కాదని బిజెపి జాతీయాధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అద్వానీ రాజీనామాకు వేరే కారణాలున్నాయని ఆయన చెప్పారు. ముంబైలో ఓ ప్రముఖ దినపత్రిక ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఆ విషయం చెప్పారు. మోడీని ప్రచార కమిటీ చైర్మన్గా నియమించిన విషయంలో ప్రజల నాడిని విస్మరించబోమని ఆయన అన్నారు.