విలవిల: ఉత్తరాఖండ్లో అనంతపురంవాసి మృతి
హైదరాబాద్: ఉత్తరాఖండ్ వరదల్లో అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు మండలం చిన్న హోతూరు గ్రామానికి చెందిన వీరభద్రప్ప(19) మృతి చెందాడు. బంధువులకు బుధవారం ఈ సమాచారం అందింది. దాంతో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడి తండ్రి ఈశ్వరయ్య జిల్లాలోని బుక్కరాయసముద్రం కాశీవిశ్వేశ్వర ఆలయంలో అర్చకునిగా పని చేస్తున్నాడు. ఆయనతో కలిసి ఉత్తరకాశీ యాత్రకు వెళ్లిన వీరభద్రప్ప వరదల్లో చిక్కుకుని మృత్యువాత పడ్డాడు.
ఉరవకొండకు చెందిన 11 మంది, చిన్న హోతూరుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఉత్తరాఖండ్ సమీపంలోని గౌరీకుంట్ వద్ద స్తంభించిన ట్రాఫిక్లో చిక్కుకుపోయారు. ఉరవకొండకు చెందిన మఠం నాగభూషణం ఆధ్వర్యంలో ఉరవకొండకు చెందిన నేత్రావతి, మహేశ్వరీ, నటరాజ్, చిన్న బసమ్మ, నూర్ మహ్మద్, రాఘవాచారి, చంద్రశేఖర్, పరమేశ్వరి, ఈశ్వరయ్య, మోపిడి రాజు, రామాంజినేయులు, వీరభద్రప్పలు ఈ నెల 9వ తేదీన అనంతపురం నుండి రైలులో బయలుదేరారు.

తిరుగుప్రయాణంలో ఉన్న జిల్లాకు చెందిన 13 మందితో పాటు దాదాపు 2 వేల మంది గౌరి కుండ్ వద్ద స్థంభించిన ట్రాఫిక్ కారణంగా అటవీ ప్రాంతంలో చిక్కుకున్నట్లు బాధితులు బుధవారం ఫోన్ ద్వారా సమాచారం అందించారు.
రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర యాత్రికులు ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్నారు. వారి క్షేమ సమాచారం తెలియక ఇక్కడి వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. విజయనగరం జిల్లాలోని విజయనగరం, గజపతినగరం, గరివిడి, సాలూరు, బొబ్బిలి తదితర ప్రాంతాల నుంచి 150 మంది యాత్రికులు వెళ్లినట్లు సమాచారం. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల నుంచి రెండు వందల మంది యాత్రికులు వెళ్ళినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications