అమర్నాథ్ యాత్రపై ఉగ్రవాదుల కన్ను, గిలానీ ఖండన
న్యూఢిల్లీ/శ్రీనగర్: దక్షిణ కాశ్మీర్లోని హిమాలయాలపై ఈ నెల 28 నుంచి ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్రకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉందని ఆర్మీ సంకేతాలను ఇచ్చింది. దీంతో భద్రతను మరింత పటిష్ఠం చేస్తున్నారు. కేంద్రం, జమ్మూ-కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి.
ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా అమర్నాథ్కు అదనపు బలగాలను పంపించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే బుధవారం ఢిల్లీలో విలేకరులకు తెలిపారు. భక్తులు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అమర్నాథ్ యాత్రకు ఉగ్రవాదుల ముప్పు ఉందని షిండే తెలిపారు. అయితే అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

యాత్రకు ఎలాంటి ఆటంకం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై శ్రీనగర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు భరోసాగా భద్రతా సంస్థలు చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖ ఆదేశించింది. ఎలాంటి దుర్ఘటనలు సంభవించకుండా ఇంటెలిజెన్స్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని ఉత్తర్వులు జారీ చేసింది. యాత్రకు బయలుదేరే క్యాంపుల వద్ద సిసి కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు.
రాజకీయ డ్రామా: గిలానీ
అమర్నాథ్ యాత్రికులకు ఉగ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు కేంద్రం చేస్తున్న ఆరోపణలను హురియత్ కాన్ఫరెన్స్ అధినేత అలీషా గిలానీ కొట్టిపారేశారు. ఇదంతా రాజకీయ డ్రామా అని మండిపడ్డారు. యాత్రికులకు అటు ఉగ్రవాదుల నుంచి కానీ, ఇటు కాశ్మీరు ప్రజల నుంచి కానీ ఎటువంటి ముప్పు లేదన్నారు.
మానస సరోవర్ యాత్ర రద్దు
కైలాస్ మానస సరోవర్ యాత్రలో రెండు నుంచి 10 బ్యాచుల యాత్రను ప్రభుత్వం రద్దు చేసింది. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు, వరదల కారణంగా యాత్రా మార్గాలు దెబ్బతినడంతో ఈ నిర్ణయం తీసుకుంది.












Click it and Unblock the Notifications