పిరికివాళ్ల చర్య: ప్రధాని, ఉగ్రదాడిలో రాష్ట్ర జవాన్ మృతి
మరోవైపు నిన్న ఉగ్రవాదుల దాడిలో ఎనిమిది మంది జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. వారిలో ఒకరు ఆంధ్రా జవాన్ కూడా ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యాదయ్య ఈ ఉగ్రదాడిలో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని రేపు హైదరాబాదుకు తరలించనున్నారు.
ప్రధాని పర్యటనకు 24 గంటల ముందు ఉగ్రవాదులు పెట్రేగిపోయిన విషయం తెలిసిందే. ఆర్మీ కాన్వాయ్పైనే ఉగ్రవాదులు సోమవారం కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 8 మంది జవాన్లు మరణించారు. మరో 19 మంది గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దాడి జరిపింది తామేనని హిజ్బుల్ ముజాహిదీన్ ప్రకటించుకుంది.
జమ్మూ కాశ్మీరులో ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాద దాడిని ప్రధాని మన్మోహన్ సింగ్ వెంటనే ఖండించారు. ఆ రాష్ట్రంలో శాంతిని నెలకొల్పాలన్న భద్రత దళాల స్తైర్యాన్ని ఇటువంటి పిరికిపంద చర్యలు అడ్డుకోలేవని వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా, ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాద దాడిని బిజెపి కూడా తీవ్రంగా ఖండించింది.