రాయల తెలంగాణ ఊహాజనితమే: జానా రెడ్డి

తెలంగాణ ప్రజల ఆకాంక్షను మరోసారి పార్టీ అధిష్టానానికి చూపేందుకు, తమ పోరాటానికి తెలంగాణ ప్రజల మద్దతును చాటేందుకు సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా తాము పార్టీలోనే కొనసాగుతున్నామని, ఎప్పుడైనా గీత దాటితే ప్రజల ఆకాంక్ష కోసమే తప్ప అధిష్టానాన్ని వ్యతిరేకించేందుకు కాదని ఆయన అన్నారు.
పార్టీ అధిష్టానానికి తెలంగాణపై ఎన్నో విజ్ఞప్తులు చేశామని ఆయన చెప్పారు. పార్లమెంటులోనూ శానససభలోనూ తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలియజేశామని ఆయన అన్నారు. ఈ నెల 30వ తేదీన జరిగే సభకు రెండు లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నామని, కాంగ్రెసు ద్వారానే తెలంగాణ సాధ్యమని చాటాలని ఆయన అన్నారు. సభకు వేలాదిగా తరలి రావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్ర నాయకులు సహకరించాలని, సుహృద్భావ వాతావరణంలో అభివృద్ధి కోసం విడిపోదామని ఆయన అన్నారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన పార్టీ అధిష్టానాన్ని కోరారు.
రాయల తెలంగాణ ఆలోచన మాత్రమే..
కాగా, ఈ నెల 30వ తేదీన జరిగేది కాంగ్రెసు సభ కాదని, తెలంగాణ సభ అని తెలంగాణ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ అన్నారు. విద్యార్థి, ఉద్యోగులు, ఇతర ప్రజా సంఘాల వాళ్లంతా సభకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాయల తెలంగాణ అనేది ఆలోచన మాత్రమేనని, దానిపై తెలంగాణ ప్రజలు చర్చకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. ప్యాకేజీలు అనేది నిజం కాదని ఆయన అన్నారు. విభజన జరిగితే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) విలీనం అనేది అప్రస్తుతమని యాష్కీ అన్నారు.












Click it and Unblock the Notifications