అంత ఈజీ కాదు: విభజనపై భిన్నంగా కిరణ్ వ్యాఖ్యలు

విభజన అంత సులువైన పని కాదని ముఖ్యమంత్రి ఆ మంత్రులతో వ్యాఖ్యానించినట్లుగా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది. ఇప్పట్లో విభజన జరగదని, అది సులువైంది కాదని, తెలంగాణపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పడుతుందని అన్నారట. "రాష్ట్ర విభజన జరిగితే గందరగోళం నెలకొంటుంది. ఇప్పుడున్న ఉద్యమాలకంటే తీవ్రమైన ఉద్యమాలు తలెత్తే ప్రమాదం ఉంది. జలాల పంపిణీ, సరిహద్దు సమస్య వంటి అనేకం తెరపైకి వస్తాయి. ఇవి అంత త్వరగా పరిష్కారం అయ్యేవి కావు'' అని కిరణ్ చెప్పారట.
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతల్లో వస్తుందనే ఉత్సాహం కనిపిస్తోందని ముఖేశ్ గౌడ్ అన్నారట. అధిష్ఠానం తెలంగాణ వైపే మొగ్గు చూపుతోందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోందని, తాము మాత్రం అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన ముఖ్యమంత్రికి స్పష్టం చేశారట.
మరోవైపు విభజనపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమేనని, మన చేతుల్లో ఏమీ లేదని తెలుగుదేశం పార్టీ నేతలతో ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారట. మంగళవారం మధ్యాహ్నం కొందరు టిడిపి ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. తెలంగాణపై త్వరగా తేల్చేయాలని టిడిపి నేతలు కోరగా పై విధంగా స్పందించారట.












Click it and Unblock the Notifications