రాయలసీమ కోళ్ల గుంపు కాదు: సినీ యాక్టర్ నరేష్
తెలంగాణ కోసం కాంగ్రెసు ప్రకటించే రోడ్ మ్యాప్ ఎందుకు పనికి రాదని ఆయన అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం మూడు ప్రాంతాలతో కాంగ్రెసు పార్టీ ఆడుకుంటోందని ఆయన అన్నారు. గత 50 ఏళ్లుగా కాంగ్రెసు పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను మోసం చేస్తోందని ఆయన అన్నారు. రాయలసీమ ప్రజల ఆత్మగౌరవంతో కాంగ్రెసు చెలగాటమాడుతోందని ఆయన విమర్శించారు.
నా స్వరం మారదు: జెడి శీలం
రాష్ట్ర విభజన విషయంలో తన స్వరం మారదని కేంద్ర మంత్రి జెడి శీలం అన్నారు. తనది జాతీయవాదమని, గతంలో చెప్పినట్లుగానే తాను సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నానని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను మాట మార్చే వ్యక్తిని కాదని ఆయన అన్నారు. పదవి వచ్చాక తాను యూటర్న్ తీసుకున్నాననే అపోహకు గురి కావద్దని ఆయన అన్నారు.
ప్రాంతీయ, ఉప ప్రాంతీయ వాదాలను రెచ్చగొట్టేవారిని నమ్మవద్దని ఆయన కోరారు. రాష్ట్ర విభజన సున్నితమైన అంశమని, కాంగ్రెసు అధిష్టానం విభజన విషయంలో సముచితమైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. తాను అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు.
కేంద్ర పాలిత ప్రాంతంగా హైదరాబాద్: జెసి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే సమస్యలు తప్పవని మాజీ మంత్రి, రాయలసీమ ప్రాంతానికి చెందిన కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఆయన శనివారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలుసుకుని రాష్ట్ర విభజనపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. అదే విషయాన్ని తాము ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పినట్లు ఆయన మీడియా ప్రతినిధులకు తెలిపారు. రాష్ట్రాన్ని విడదీయడం మంచిది కాదని రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డి అన్నారు.