టిడిపిలోకి డికె సమరసింహా రెడ్డి, నేడు మరో ఇద్దరు

ఆయన తొలుత కాంగ్రెసు పార్టీలో కీలక నేతగా ఉన్నారు. కోట్ల విజయ భాస్కర రెడ్డి మంత్రివర్గంలో పని చేశారు. ఆ త్రవాత 1999లో కాంగ్రెసు పార్టీకి దూరమయ్యారు. బిజెపిలో చేరినా, క్రియాశీలకంగా వ్యవహరించలేదు. ఆ తర్వాత మళ్లీ కొంతకాలం కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. అయితే ఆరేళ్ల క్రితం ఆ పార్టీకి దూరమయ్యారు. అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు.
డికె సమరసింహా రెడ్డి పార్టీలో చేరిన సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తెలంగాణకు తాము వ్యతిరేకే కాదని, మహానాడులో తెలంగాణపై తీర్మానం చేశామని, దానిపై వెనక్కి పోమని చెప్పారు. విద్యార్థులు, ఉద్యోగులపై అక్రమ కేసులు ఎత్తేస్తామన్నారు. అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలిస్తామన్నారు.
కాంగ్రెసు అసమర్థ పార్టీ అని, వైయస్సార్ కాంగ్రెసు జైలు పార్టీ అని, ఓట్లు, సీట్లు అమ్ముకునే పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి అని మండిపడ్డారు. పార్టీ అధ్యక్షుడి కొడుకు సెటిల్మెంట్లు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయని ఆరోపించారు. టిఆర్ఎస్ నేతలు చీటింగ్ కేసుల్లోను ఇరుక్కున్నారన్నారు.
సమరసింహా తర్వాత మరో ఇద్దరు
డికె సమరసింహా రెడ్డి తర్వాత తెలుగుదేశం పార్టీలోకి ఆదివారం మరో ఇద్దరు తెలంగాణ ప్రాంత నేతలు చేరనున్నారు. హన్మకొండ మాజీ పార్లమెంటు సభ్యుడు చాడ సురేష్ రెడ్డి, ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరాములు ఈ రోజు టిడిపిలో చేరనున్నారు.












Click it and Unblock the Notifications